టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడుతోంది. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి కీపర్ క్యాచ్గా వెనుదిరిగిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్లోనూ 17 పరుగులకే ఔటయ్యాడు.
అయితే ఈ సారి చేజేతులా వికెట్ పారేసుకున్నాడు. అంపైర్ తప్పిదంతో పాటు అలసత్వంతో విరాట్ కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. విరాట్ కోహ్లీ వికెట్కు సంబంధించిన రీప్లేలను చూసి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అవాక్కయ్యాడు.

బంతి బ్యాట్కు తాకింది కూడా తెలియలేదా? అని మందలించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్గా మారాయి. తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించిన అంపైర్ రిచర్డ్ కెటిల్బరో మాత్రం రీప్లేను చూసి ఓ చిరు నవ్వు నవ్వాడు.
అసలేం జరిగిందంటే..?
భారత రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మెహ్దీ హసన్ మీరాజ్ వేసిన 20వ ఓవర్లో విరాట్ కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ ఓవర్ రెండో బంతిని హసన్ మీరాజ్.. స్టంప్ టూ స్టంప్ వేయగా.. కోహ్లీ అక్రాస్ ది లైన్ ఫ్లిక్ షాట్ ఆడబోయాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి ప్యాడ్లను తాకింది. వెంటనే మెహ్దీ హసన్ అప్పీల్ చేయగా.. అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఔటిచ్చాడు. రివ్యూ తీసుకోవాలని శుభ్మన్ గిల్ సూచించినా వినకుండా కోహ్లీ పెవిలియన్ చేరాడు.
అయితే రీప్లేలో బంతి.. బ్యాట్ను తాకినట్లు స్పష్టమైంది. ఈ వీడియోను చూసి రోహిత్ శర్మ షాకయ్యాడు. రివ్యూ తీసుకోవాల్సింది కదా? అని కోహ్లీతో అన్నాడు. శుభ్మన్ గిల్ సైతం అయ్యో అంటూ రియాక్షన్ ఇచ్చాడు. మొత్తానికి కోహ్లీ అలసత్వంతో వికెట్ పారేసుకున్నట్లు అయ్యింది.
భారీ ఆధిక్యం దిశగా భారత్..
విరాట్ కోహ్లీ(17)తో పాటు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 3 వికెట్లకు 81 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(33 బ్యాటింగ్), రిషభ్ పంత్(12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 308 పరుగులకు చేరింది. అంతకుముందు 339/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు కుప్పకూలింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్(5/83) ఐదు వికెట్లు తీయగా.. టాస్కిన్ అహ్మద్(3/55) మూడు వికెట్లు పడగొట్టాడు. నహిద్ రాణా, మెహ్దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/30), ఆకాశ్ దీప్(2/19), రవీంద్ర జడేజా(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. దాంతో భారత్ 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.