టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్తో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ అనూహ్యంగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో 60 ఏళ్ల తర్వాత కాన్పూర్ వేదికగా ఓ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తొలి భారత కెప్టెన్గా నిలిచాడు.
1964లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ.. కాన్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో చివరిసారిగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత మరే భారత సారథి కాన్పూర్ వేదికగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోలేదు. ఇన్నాళ్లకు రోహిత్ శర్మ ఆ పని చేసి చరిత్రకెక్కాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లోనూ టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుందని అంతా భావించారు. కానీ రోహిత్ శర్మ అనూహ్య నిర్ణయంతో అందరికి షాకిచ్చాడు.

గత 9 ఏళ్లలో భారత గడ్డపై ఓ టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఇదే తొలిసారి. 2015లో బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సాధారణంగా భారత్ గడ్డపై టాస్ గెలిచిన జట్లు ముందుగా బ్యాటింగ్ చేసేందుకు ఆసక్తి చూపుతాయి. స్పిన్కు అనుకూలంగా ఉండే వికెట్లపై నాలుగో ఇన్నింగ్స్ ఆడటం కష్టమవుతుందని ఈ పనిచేస్తాయి.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. క్రీజులో మోమినల్ హక్(40 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్(6 బ్యాటింగ్) ఉన్నారు. నజ్ముల్ హోస్సేన్ షాంటో(31), షెడ్మన్ ఇస్లామ్(24), జకీర్ హసన్(0) దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. శనివారం కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభమైన తొలి మూడు రోజులు వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించింది.