టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా గురువారం ప్రారంభమైన తొలి మ్యాచ్తో రోహిత్ శర్మ సారథిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత బంగ్లాదేశ్తో మూడు ఫార్మాట్లు ఆడిన రెండో భారత్ సారథిగా నిలిచాడు.
బంగ్లాదేశ్తో ఓ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. 2015లో బంగ్లాదేశ్తో ఆటగాడిగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. 2019లో రెండు టెస్ట్ల సిరీస్ ఆడాడు. గాయంతో 2017లో బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్కు దూరమయ్యాడు. 2017-2021 వరకు విరాట్ కోహ్లీకి డిప్యూటిగా వ్యవహరించిన రోహిత్ శర్మ.. అతని గైర్హాజరీలో జట్టును నడిపించాడు.

2018లో నిదహాస్ ట్రోఫీ, ఆసియాకప్లకు కోహ్లీ దూరంగా ఉండగా.. రోహిత్ టీమిండియాను నడిపించాడు. దినేశ్ కార్తీక్ సంచలన బ్యాటింగ్తో నిదహాస్ ట్రోఫీలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతిని సిక్సర్గా తరలించి దినేశ్ కార్తీక్ చిరస్మరణీయ విజయాన్నందించాడు. 2018 ఆసియాకప్కు కోహ్లీ దూరంగా ఉండగా.. రోహిత్ సారథిగా వ్యవహరించాడు.
2022లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు అందుకున్నప్పటికీ.. గాయంతో బంగ్లాదేశ్ పర్యటన 2022కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించాడు.
ఇప్పటి వరకు బంగ్లాదేశ్పై రోహిత్ 6 వన్డేలతో పాటు ఏడు టీ20లు, ఒక టెస్ట్ మ్యాచ్కు సారథిగా వ్యవహరించాడు. ధోనీ మాత్రం 11 వన్డేలు, 5 టీ20లు, ఒక టెస్ట్కు కెప్టెన్సీ చేశాడు. విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, కేఎల్ రాహుల్లు బంగ్లాదేశ్తో రెండు ఫార్మాట్లలోనే కెప్టెన్గా వ్యవహరించారు.
బంగ్లాదేశ్తో కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఒక్క టీ20 మ్యాచ్ ఆడలేదు. గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్లు రెండు ఫార్మాట్స్లో మాత్రమే బంగ్లాదేశ్తో కెప్టెన్గా వ్యవహరించారు. రాహుల్ కూడా టీ20ల్లో కెప్టెన్గా బంగ్లాదేశ్తో ఆడలేదు.
టాపార్డర్ విఫలం..
చెన్నై వేదికగా జరుగుతున్న తాజా టెస్ట్లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహ్ముద్(4/35) ధాటికి భారత్ 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(6), శుభ్మన్ గిల్(0), విరాట్ కోహ్లీ(6) వరుసగా పెవిలియన్ చేరడంతో 34 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో యశస్వి జైస్వాల్(118 బంతుల్లో 9 ఫోర్లతో 56), రిషభ్ పంత్(52 బంతుల్లో 6 ఫోర్లతో 39) నాలుగో వికెట్కు 62 పరుగులు జోడించారు. నిలకడగా ఆడుతున్న పంత్ను హసన్ మహ్ముద్ ఔట్ చేయడంతో కీలక భాగస్వామ్యానికి తెరపడింది. హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే నహీద్ రాణా బౌలింగ్లో యశస్వి జైస్వాల్ వెనుదిరగ్గా.. కేఎల్ రాహుల్(16)ను హసన్ మీరాజ్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన జడేజా(7 బ్యాటింగ్), అశ్విన్(21 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు.