టీమిండియా సారథి రోహిత్ శర్మ తన మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో తనదైన బౌలింగ్ వ్యూహాలు, ఫీల్డ్ సెటప్తో ప్రత్యర్థి బ్యాటర్లను బుట్టలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన ఆ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(127 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 82)ను తన మార్క్ కెప్టెన్సీతో పెవిలియన్ చేర్చాడు.
రవీంద్ర జడేజా సాయంతో అతనికి చెక్ పెట్టాడు. రోహిత్ వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన నజ్ముల్ షాంటో వారి ఉచ్చులో చిక్కుకొని పెవిలియన్ చేరాడు.రవీంద్ర జడేజా వేసిన 59వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతికి నజ్ముల్ షాంటో భారీ షాట్ ఆడబోయి జస్ప్రీత్ బుమ్రా చేతికి చిక్కాడు.

ఈ ఓవర్ మొత్తం పరుగులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన జడేజా.. ఆఖరి బంతిని మాత్రం ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసాడు. దాంతో టెంప్ట్ అయిన షాంటో ఓవర్ ఎక్స్ట్రా కవర్ దిశగా లాఫ్ట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. మిస్ టైమ్ అయిన బంతి ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేవగా.. అప్పటికే ఆ దిశగా ఫీల్డ్లో ఉన్న బుమ్రా పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. దాంతో షాంటో శతకం చేసుకునే అవకాశం చేజారింది.
ఈ మ్యాచ్లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రవిచంద్రన్ అశ్విన్(6/88) ధాటికి 234 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(127 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 82) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్తో పాటు జడేజా(3/58) మూడు వికెట్లు తీసాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటవ్వగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో రోహిత్ సేనకు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్లో అశ్విన్(113), రవీంద్ర జడేజా(86) సత్తా చాటితే.. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా(4/50) నిప్పులు చెరిగాడు.
రెండో ఇన్నింగ్స్ను టీమిండియా 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ ( 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 నాటౌట్), రిషభ్ పంత్ (128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109) శతకాలతో రాణించారు.