బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్తోనే టెస్ట్ క్రికెట్లోకి టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంతో దాదాపు రెండేళ్ల పాటు పంత్ రెడ్ బాల్ క్రికెట్కు దూరయ్యాడు.
రీఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే పంత్ (128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు 109) సెంచరీతో చెలరేగాడు. అయితే తన బ్యాటింగ్ సందర్భంగా రిషభ్ పంత్ బంగ్లాదేశ్ ఫీల్డ్ సెట్ చేసి అందర్నీ నవ్వించాడు. శుభ్మన్ గిల్-రిషభ్ పంత్ ధాటికి బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా డీలా పడిపోయాడు. ఈ క్రమంలోనే పంత్ ఫీల్డ్ సెటప్లో వాళ్లకు సాయం చేశాడు.

'ఇద్దరు ఒకే ప్లేస్లో ఫీల్డింగ్ చేస్తున్నారు. మిడ్ వికెట్లో ఎవరూ లేరు. ఒకరు అక్కడకు వెళ్లండి.'అని బంగ్లా ఫీల్డర్లకు సలహాలు ఇచ్చాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో కూడా పంత్ మాట విని ఒక ఫీల్డర్ను మిడ్ వికెట్ వద్ద సెట్ చేశాడు. పంత్ మాట్లాడిన మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అవ్వగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పంత్ చేసిన పనికి నెటిజన్లు జోకులు పేల్చారు. ప్రత్యర్థి జట్టు ఫీల్డ్ సెట్ చేయడం ఏంట్రా? అంటూ మీమ్స్ ట్రెండ్ చేశారు.
భారత విజయానంతరం ఫీల్డ్ సెట్ చేయడంపై రిషభ్ పంత్ స్పందించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా మాటలతో ప్రభావితమై ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చాడు. క్వాలిటీ ఆఫ్ క్రికెట్ కోసం తాను బంగ్లాదేశ్ ఫీల్డ్ సెట్ చేసినట్లు సమాధానం ఇచ్చాడు. 'ఆఫ్ ద ఫీల్డ్లో అజయ్ భాయ్తో నేను తరుచూ మాట్లాడుతూ ఉంటాను. క్రికెట్ యొక్క నాణ్యత పెంచాలని ఆయన తరుచూ నాతో చెబుతుంటాడు. ఎక్కడ ఆడినా.. ఎవరితో ఆడినా క్వాలిటీ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలని చెబుతుంటాడు.
నేను బ్యాటింగ్ చేసేటప్పుడు మిడ్ వికెట్లో ఫీల్డర్ లేడు. ఒకే ప్లేస్లో ఇద్దరు ఫీల్డర్లు ఉన్నారు. దాంతో ఒక ఫీల్డర్ను మిడ్ వికెట్వైపు వెళ్లమని చెప్పాను.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
ఇక తన రీఎంట్రీ గురించి మాట్లాడుతూ.. 'ఈ ఇన్నింగ్స్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే చెన్నైలో ఆడటం నాకు చాలా ఇష్టం. రెండోది ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత నేను మూడు ఫార్మాట్లు ఆడటంపై ఫోకస్ పెట్టాను. రెడ్ బాల్ క్రికెట్లో ఇది నా ఫస్ట్ మ్యాచ్. నేను మెరుగ్గానే రాణించానని అనుకుంటున్నా. ఈ ఇన్నింగ్స్ నాకు భావోద్వేగపూరితమైనదే. ప్రతీ మ్యాచ్లో నేను పరుగులు చేయాలనుకుంటున్నా.
నాకిష్టమైన టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. బయట జనాలు ఏం అనుకుంటున్నారో నాకు తెలియదు. నేను మాత్రం పరిస్థితులకు తగ్గట్లు నాదైన శైలిలో ఆడే ప్రయత్నం చేస్తున్నాను. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పుడు భాగస్వామ్యం నెలకొల్పడం కీలకం. గిల్, నేను అదే చేశాం. నాకు మంచి సంబంధం ఉన్న శుభ్మన్ గిల్తో భాగస్వామ్యం నెలకొల్పడం సంతోషంగా ఉంది.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.