గెలిచినా.. ఓడినట్లే..
కొందరు ఆటగాళ్ల పోరాటం వల్ల, కాస్త అదృష్టం కూడా కలిసొచ్చి రెండో టెస్టు భారత్ సొంతమైంది కానీ.. మీర్పూర్లో మన జట్టు ప్రదర్శన చూశాక నిజంగా విజయానికి అర్హమైందా అంటే ధీమాగా ఔనని చెప్పలేని పరిస్థితి. సెలక్షన్ దగ్గర్నుంచి ఆటతీరు వరకు మ్యాచ్లో టీమిండియా చేసిన తప్పుల చిట్టా పెద్దదే.
బంగ్లాదేశ్ లాంటి బలహీన జట్టుపై చచ్చీ చెడీ గెలవడం అంటే ఓటమితో సమానం. అశ్విన్ అసాధారణ పోరాటం పుణ్యానా టీమిండియా ఈ మ్యాచ్ గెట్టెక్కి ఇజ్జత్ కాపాడుకుంది. కొన్నేళ్లుగా నిలకడ లేమికి మారుపేరుగా మారుతున్న టాప్ఆర్డర్.. ఈ మ్యాచ్లో మరింత పేలవ ప్రదర్శన చేసింది.
కోహ్లీ, రాహుల్ ఘోర వైఫల్యం..
ఒకప్పుడు పెట్టని కోటలా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు వరుస వైఫల్యాలతో జట్టుకు భారమవుతున్నాడు. 1, 19, 24, 1.. ఇవీ బంగ్లాతో టెస్టు సిరీస్లో కోహ్లీ స్కోర్లు. బ్యాటింగ్తో పాటు అతడి ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా పడిపోతున్నాయి. రెండో టెస్టు మూడో రోజు అతను స్లిప్లో మూడు క్యాచ్లు వదిలేశాడు. కేఎల్ రాహుల్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.
తాత్కాలికంగా జట్టు పగ్గాలందుకున్న అతను ముందుండి నడిపిస్తాడనుకుంటే.. నాలుగు ఇన్నింగ్స్ల్లో వరుసగా 22, 23, 10, 2 పరుగులే చేశాడు. రోహిత్ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు కానీ.. ఇటీవల అతడి ప్రదర్శనా అంతంతమాత్రమే.
ఫ్లాట్ పిచ్లు అయితేనే ఆడుతారు..
పుజారాలోనూ నిలకడ లోపించింది. తొలి టెస్టులో సెంచరీ చేసిన అతను.. రెండో మ్యాచ్లో తేలిపోయాడు. పుజారాతో పాటు శుభ్మన్ రెండో ఇన్నింగ్స్లో పేలవమైన ఫుట్వర్క్తో వికెట్లు సమర్పించుకున్నారు. టర్న్ అవుతున్న బంతుల్ని బ్యాక్ఫుట్పై ఆడాలన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి ముందుకెళ్లి ఆడి స్టంపౌటవడమేంటో? టాప్ఆర్డర్ వైఫల్యంతో తర్వాతి బ్యాటర్ల మీద ఒత్తిడి పెరుగుతోంది.
లోయరార్డర్ ఆటగాళ్లు ఎన్ని మ్యాచ్ల్లో జట్టును రక్షిస్తారు? ఫ్లాట్ పిచ్లు ఎదురైనపుడు బాగా ఆడేసి సగటులు సరిచేసుకుంటున్నారే తప్ప.. ఎలాంటి పిచ్లు, పరిస్థితుల్లో అయినా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లు కరవైపోయారు. బాగా బౌన్స్ అయ్యే, ఎక్కువ స్పిన్ తిరిగే పిచ్ల మీద నిలబడి ఆడే బ్యాటర్లు కనిపించడం లేదు.
స్టార్ డమ్ ఎక్కువైంది...
ఈ మధ్య జట్టులో 'స్టార్' సంస్కృతి బాగా పెరిగిపోతోంది. గత ప్రదర్శనల ఆధారంగానే చాలామంది జట్టులో కొనసాగుతున్నారు. స్టార్ హోదా, బోర్డులో తమకున్న అండదండల వల్ల తమ స్థానాలకు ముప్పేమీ లేదన్న ధీమా కొందరిలో కనిపిస్తోంది. ఏ ఆటగాడూ వైఫల్యాలను అధిగమించేందుకు శ్రమిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లు ఖాళీ సమయం దొరికితే రంజీ ట్రోఫీ ఆడేవారు. లేకుంటే నెట్స్లో తీవ్రంగా శ్రమించేవారు. కానీ ఇప్పటి ఆటగాళ్లు పనిభారం పేరుతో తరచుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. దేశవాళీల జోలికే వెళ్లట్లేదు.
పేరు గొప్ప ఆటగాళ్ల విషయంలో వీలైనంత త్వరగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తుది జట్టు ఎంపికలో బీసీసీఐ పెద్దల జోక్యం కూడా పేలవ ప్రదర్శనకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే.. టీమిండియా మరో వెస్టిండీస్ టీమ్ తయారవడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.