టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు సలహాలు అవసరం లేదని స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో అశ్విన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అతనికి తానేం సలహాలు ఇవ్వలేదని స్పష్టం చేశాడు. రెండో రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన రవీంద్ర జడేజా.. సెంచరీ చేజార్చుకోవడం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇలా జరగడం ఆటలో సహజమేనని పేర్కొన్నాడు. 'ఈ రోజు త్వరగా ఔటయ్యాను. ఇదంతా ఆటలో సహజమే. రెండో ఇన్నింగ్స్లో మేం మంచి స్కోర్ చేయాలి. నా బౌలింగ్ పట్ల సంతోషంగా ఉన్నాను. నేను 300 టెస్ట్ వికెట్ల మైలురాయి అందుకునేందుకు ఈ మ్యాచ్ చక్కటి అవకాశం. మా ఆధిక్యానికి మేం 120-150 పరుగులు జత చేయాల్సి ఉంది. ఆ తర్వాత వీలైనంత త్వరగా వికెట్లు తీయాలి. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. అలాగే పేసర్లకు సహకరిస్తోంది. ఆడ్ బాల్ సీమ్ అవుతుంది. ఫాస్ట్ బౌలర్లు తమ వెన్ను వంచి బౌలింగ్ చేస్తే వికెట్లు దక్కుతాయి.

రవిచంద్రన్ అశ్విన్కు ఎవరీ సలహాలు అవసరం లేదు. మనం ఎలాంటి తప్పిదాలు చేయవద్దని మాత్రమే అతనితో చెప్పా. ఎందుకంటే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో పాటు మనం మంచి బ్యాటింగ్ చేస్తున్నామని వివరించా. సింగిల్స్ తీయడంపై ఫోకస్ పెడుదామని తెలిపా. ఎక్కువగా పరుగెత్తకుండా చూసుకుంటానని చెప్పా. అతనితో కలిసి నేను చాలా మ్యాచ్లు ఆడాను. సొంతమైదానంలో అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వికెట్లో ఫాస్ట్ బౌలర్స్తో పాటు స్పిన్నర్లకు సహకారం లభిస్తోంది. ఆడ్ బాల్ స్పిన్ అవ్వడంతో పాటు తక్కువ ఎత్తులో వస్తుంది.'అని జడేజా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్పై భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 3 వికెట్లకు 81 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(10), రోహిత్ శర్మ(5), విరాట్ కోహ్లీ(17) విఫలమైనా.. శుభ్మన్ గిల్(33 బ్యాటింగ్), రిషభ్ పంత్(12 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, మెహ్దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 308 పరుగులకు చేరింది.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోర్కు 37 పరుగులు మాత్రమే జోడించింది. అశ్విన్(113) సెంచరీతో రాణించగా.. జడేజా(86) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/30), ఆకాశ్ దీప్(2/19), రవీంద్ర జడేజా(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు.