టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం ఇంటికే పరిమితమైన రవీంద్ర జడేజా.. సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బంగ్లాదేశ్తో గురువారం(సెప్టెంబర్) ప్రారంభమయ్యే రెండు టెస్ట్ల సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు.
చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించగా.. జడేజాకు చోటు దక్కింది. స్పిన్కు అనుకూలంగా ఉండే చెన్నై మైదానంలో రవీంద్ర జడేజా కీలకం కానున్నాడు. అయితే జడేజా మరో 6 వికెట్లు తీస్తే టెస్ట్ల్లో 300 వికెట్ల మైలురాయి అందుకోనున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్గా.. నాలుగో స్పిన్నర్గా చరిత్రకెక్కనున్నాడు.

ఇప్పటి వరకు 75 టెస్ట్ మ్యాచ్లు ఆడిన జడేజా 294 వికెట్లు తీసాడు. బంగ్లాదేశ్తో జరిగే అప్కమింగ్ సిరీస్లో 6 వికెట్లు తీస్తే 300 క్లబ్లో చేరనున్నాడు. అనిల్ కుంబ్లే(619), రవిచంద్రన్ అశ్విన్(516), హర్భజన్ సింగ్(417) జడేజా కంటే ముందు ఈ ఫీట్ సాధించారు. ఓవరాల్గా ఈ ఘనత సాధించనున్న 8వ భారత బౌలర్గా నిలవనున్నాడు. పేసర్లలో కపిల్ దేవ్(434), జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311) టెస్ట్ల్లో 300 వికెట్ల మైలు అందుకున్నారు.
చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. చెపాక్ మైదానం స్పిన్నర్లకు స్వర్గధామం. దాంతో టీమిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్తో పాటు కుల్దీప్ యాదవ్లకు తుది జట్టులో చోటు దక్కనుండగా.. అక్షర్ పటేల్కు నిరాశనే ఎదురవ్వనుంది. అతను బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
బంగ్లాదేశ్తో తొలి టెస్ట్కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్(కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్