పుణె: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన మార్క్ ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పుణె వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో రవీంద్ర జడేజా కళ్లు చెదిరే క్యాచ్తో ఔరా అనిపించాడు. అసాధారణ ఫీల్డింగ్తో క్రీజులో సెట్ అయిన ముష్ఫికర్ రహీమ్(38)ను పెవిలియన్ చేర్చాడు. ఈ క్యాచ్ అందుకున్న అనంతరం డగౌట్ వైపు చూస్తూ రవీంద్ర జడేజా ఇచ్చిన రియాక్షన్ వైరల్గా మారింది.
టీమిండియా ఫీల్డింగ్ కోచ్ను ఉద్దేశించి అతను చేసిన సైగలు నవ్వులు పూయించాయి. జస్ప్రీత్ బుమ్రా వేసిన 43వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని బుమ్రా వైడ్గా షార్ట్ బాల్ వేయగా.. ముష్ఫికర్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాక్వార్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా సూపర్ డైవ్తో బంతిని అద్భుతంగా అందుకొని అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

ఈ క్యాచ్ అందుకున్న వెంటనే జడేజా డగౌట్లో ఉన్న ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ వైపు చూస్తూ.. సైగలు చేశాడు. బెస్ట్ ఫీల్డింగ్కు ఇచ్చే గోల్డ్ మెడల్ తనదేనని సూచించాడు. దానికి టీ దిలీప్ కూడా సరేనంటూ జడేజాను అభినందించాడు. పక్కనే ఉన్న ఫోర్త్ ఎంపైర్ ఎరాస్మస్ సైతం జడేజాకే బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఇవ్వాలని దిలీప్కు సూచించాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో ప్రతీ మ్యాచ్లో అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శన కనబర్చిన ఆటగాడికి మ్యాచ్ అనంతరం బెస్ట్ ఫీల్డర్ అవార్డుగా గోల్డ్ మెడల్ అందిస్తున్నారు. తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీకి ఈ అవార్డు దక్కగా.. రెండో మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ సొంతం చేసుకున్నాడు. మూడో మ్యాచ్లో కేఎల్ రాహుల్ దక్కగా.. నాలుగో మ్యాచ్లో తనకే అంటూ జడేజా.. టీ దిలీప్కు సూచించాడు. అయితే ఒక్క క్యాచ్.. రనౌట్కు కాకుండా మ్యాచ్ ఆసాంతం ఫీల్డింగ్లో నిలకడ కనబర్చిన ఆటగాడికి ఈ అవార్డు అందిస్తున్నారు.
ఈ మ్యాచ్లో బెస్ట్ ఫీల్డర్ అవార్డుకు రవీంద్ర జడేజాతో పాటు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్లు పోటీపడనున్నారు. రాహుల్ సైతం కళ్లు చెదిరే క్యాచ్ అందుకోగా.. కుల్దీప్ పలు బౌండరీలను అడ్డుకున్నాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు ఓపెనర్లు తన్జిద్ హసన్(43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 51), లిటన్ దాస్(82 బంతుల్లో 7 ఫోర్లతో 66) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించినా.. క్రీజులో సెట్ అయిన తర్వాత చెలరేగారు.
తొలి వికెట్కు 93 పరుగులు జోడించిన అనంతరం తన్జిద్ హసన్ను కుల్దీప్ యాదవ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. నజ్ముల్ హోస్సెన్ షాంటో(8)ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే రాహుల్ సూపర్ క్యాచ్కు మెహ్దీ హసన్(3) వెనుదిరగ్గా.. ధాటిగా ఆడుతున్న లిటన్ దాస్ను జడేజా పెవిలియన్ చేర్చాడు.
ఆ కొద్ది సేపటికే టౌహిడ్ హృదయ్(16)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయగా.. నిలకడగా ఆడుతున్న ముష్పికర్ రహీమ్ను బుమ్రా ఔట్ చేశాడు. నసమ్ అహ్మద్(14)ను సిరాజ్ ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 233 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది.