టీమిండియా వెటర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 100 వికెట్లతో పాటు 1000 పరుగులు చేసిన తొలి ఆఫ్ స్పిన్నర్గా చరిత్రకెక్కాడు. బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో సెంచరీ చేయడం ద్వారా అశ్విన్ (112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 102 బ్యాటింగ్) ఈ ఫీట్ సాధించాడు.
ఓవరాల్గా రవీంద్ర జడేజా తర్వాత ఈ ఘనతను అందుకున్న రెండో క్రికెటర్గా నిలిచాడు. ఈ ఏడాది ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో జడేజా 100 వికెట్లతో పాటు 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్గా చరిత్రకెక్కాడు. తాజాగా ఈ జాబితాలోకి అశ్విన్ చేరాడు. డబ్ల్యూటీసీ అరంగేట్ర సీజన్ నుంచి ఆడుతున్న అశ్విన్ 1000 ప్లస్ రన్స్తో పాటు 174 వికెట్లు తీసాడు. మరోవైపు రవీంద్ర జడేజా 1600 ప్లస్ పరుగులతో పాటు 102 వికెట్లు తీసాడు.

అంతేకాకుండా ఈ శతకంతో అశ్విన్ పలు రికార్డులను నమోదు చేశాడు. ఇది అశ్విన్కు 6వ టెస్ట్ సెంచరీ కాగా.. చెన్నై వేదికగా వరుసగా రెండోది. అంతర్జాతీయ క్రికెట్లో 30కిపైగా ఐదు వికెట్ల ఘనతలతో పాటు 6 శతకాలు సాధించిన ఏకైక ప్లేయర్గా అశ్విన్ రికార్డ్ సాధించాడు. ఇప్పటి వరకు 101 టెస్ట్ మ్యాచ్లు ఆడిన అశ్విన్.. 500 ప్లస్ వికెట్లతో పాటు 6 శతకాలు, 14 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 36 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకోవడంతో పాటు 8 సార్లు 10 వికెట్ల ఘనతను అందుకున్నాడు.
అశ్విన్ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 80 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును రవీంద్ర జడేజా(117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 86 బ్యాటింగ్)తో కలిసి అశ్విన్ ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు అజేయంగా 195 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అశ్విన్.. తనకు అచ్చొచ్చిన మైదానంలో అటాకింగ్ గేమ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కోహ్లీ, రోహిత్, పంత్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమైన వికెట్పై అసాధారణ బ్యాటింగ్తో భారత్కు భారీ స్కోర్ అందించాడు.