రవీంద్ర జడేజా సహకారంతోనే సెంచరీ సాధించగలిగానని టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా గురువారం ప్రారంభమైన మ్యాచ్లో అశ్విన్(112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 102 బ్యాటింగ్) సెంచరీతో సత్తా చాటాడు.
144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును రవీంద్ర జడేజా(117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 86 బ్యాటింగ్)తో కలిసి ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు అజేయంగా 195 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 80 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది.

తొలి రోజు ఆట ముగిసిన అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన అశ్విన్.. తన సెంచరీ ఇన్నింగ్స్పై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీఎన్పీఎల్ ఆడటం తన బ్యాటింగ్ మెరుగవ్వడానికి ఉపయోగపడిందని చెప్పాడు. తనకు ఎంతో ఇష్టమైన చెన్నై మైదానంలో శతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
'సొంత అభిమానుల ముందు ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతే. ఈ మైదానంలో క్రికెట్ ఆడటం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. చివరిసారిగా ఇక్కడ ఆడిన టెస్ట్లో నేను శతకం సాధించాను. రవీ భాయ్(రవి శాస్త్రి) అప్పుడు మీరే హెడ్ కోచ్గా ఉన్నారు. ఈ శతకం నాకు ఎంతో ప్రత్యేకం. టీఎన్పీఎల్ టీ20 టోర్నీ ఆడటం నా బ్యాటింగ్కు ఉపయోగపడింది.
సాధారణంగా ఔట్సైడ్ ఆఫ్ స్టంప్లో నా బ్యాట్ను ఊపుతూ ఉంటాను. ఈ తరహా పిచ్లపై దూకుడుగా ఆడటమే ఉత్తమం. రిషభ్ పంత్ కాస్త ప్రయత్నించాడు. ఇది పాత తరహా చెన్నై పిచ్. బౌన్స్తో పాటు కాస్త క్యారీ ఉంటుంది.
రెడ్ సాయిల్ పిచ్ షాట్స్ ఆడేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఇన్నింగ్స్లో జడేజా నాకు అండగా నిలిచాడు. ఒకానొక దశలో నేను చెమటలతో కాస్త అలసిపోయాను. ఈ విషయాన్ని త్వరగా పసిగట్టిన జడేజా.. నన్ను గైడ్ చేస్తూ ముందుకు సాగేలా ప్రోత్సహించాడు. మా జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో జడేజా ఒకడు.
మరో ఎండ్లో నాకు అండగా నిలిచాడు. బ్యాటింగ్ టిప్స్ చెప్పాడు. సింగిల్స్ను డబుల్స్గా మార్చాడు. ఇది నాకు ఎంతో సహకరించింది. ఇది పాత తరహా చెన్నై పిచ్. ఎక్స్ట్రా స్పిన్ బౌన్స్ అవుతోంది. మ్యాచ్ సాగుతున్నా కొద్ది వికెట్ ట్రిక్కీగా మారుతుంది. కొత్త బంతి బౌలర్లకు సహకరిస్తోంది. రేపు మేం ఫ్రెష్గా బరిలోకి దిగుతాం.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.