సొంతగడ్డపై సొంత అభిమానుల మధ్య.. జన్మనిచ్చిన తండ్రి ముందు శతకం సాధించడం కంటే గొప్ప అనుభూతి ఏం ఉంటుంది. అలాంటి మధురానుభూతిని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పొందాడు. బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో అశ్విన్(112 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 102 బ్యాటింగ్) శతకం సాధించాడు.
ఇది అశ్విన్కు 6వ టెస్ట్ సెంచరీ కాగా.. చెన్నై వేదికగా వరుసగా రెండోది. అయితే ఈ మ్యాచ్కు అశ్విన్ తండ్రి హాజరయ్యాడు. గ్యాలరీలో నుంచి అశ్విన్ బ్యాటింగ్ను ఆస్వాదించాడు. అతని సూపర్బ్ బ్యాటింగ్కు పొంగిపోయాడు.

సెంచరీ పూర్తయిన వెంటనే తన తండ్రివైపు చూస్తూ అశ్విన్ సంచరాలు చేసుకున్నాడు. అశ్విన్ క్రికెటర్గా ఎదగడంలో అతని తండ్రి రవిచంద్రన్ పాత్ర కీలకం. ఈ విషయాన్ని అశ్వినే వెల్లడించాడు. గతేడాది రవిచంద్రన్ అనారోగ్యానికి గురవ్వగా.. అశ్విన్ సిరీస్ మధ్యలోనే ఇంటికి వెళ్లొచ్చాడు. అశ్విన్ తండ్రి మ్యాచ్కు హాజరైన ఫొటోలు.. కొడుకు బ్యాటింగ్ చూసి పొంగిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.
అశ్విన్ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 80 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును రవీంద్ర జడేజా(117 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 86 బ్యాటింగ్)తో కలిసి అశ్విన్ ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు అజేయంగా 195 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహముద్ నిప్పులు చెరగడంతో తొలి 10 ఓవర్లలోనే రోహిత్ శర్మ(6), శుభ్మన్ గిల్(0), విరాట్ కోహ్లీ(6)ల వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్(56), రిషభ్ పంత్(39) ఆచితూచి ఆడి 62 పరుగులు జోడించి వెనుదిరిగారు. కేఎల్ రాహుల్(16) విఫలమయ్యాడు. దాంతో 114 పరుగులకే భారత్ 6 వికెట్లు కోల్పోయింది 200లోపు ఆలౌటవుతుందని అంతా అనుకున్నారు. కానీ అశ్విన్-జడేజా అసాధారణ పోరాటంతో జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలోనే అశ్విన్ సెంచరీ మార్క్ అందుకోగానే.. భారత ఆటగాళ్లంతా అతనికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.