చెన్నై టెస్ట్కు హాజరైన ప్రేక్షకులను చూసి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆశ్చర్యానికి గురయ్యాడని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ చెన్నై వేదికగా జరగ్గా.. టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో అశ్విన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభమైన ఉదయం ప్రేక్షకులు చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కానీ మ్యాచ్ సాగుతున్నా కొద్దీ ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. రెండు, మూడు, నాలుగో రోజు చెపాక్ మైదానం పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయింది.

ఈ జనసందోహం చూసి కోహ్లీ అవాక్కయ్యాడని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వెల్లడించాడు. మాజీ క్రికెటర్, కామెంటేటర్ అశ్వత్ బోబోతో మాట్లాడిన అశ్విన్.. ప్రేక్షకులు ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు.
'తొలి రోజు మైదానం మొత్తం ఖాళీగా ఉంది. మైదానం ఖాళీగా ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. టెస్ట్ మ్యాచ్లు చూసేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదని కోహ్లీ తరుచూ నాతో అన్నాడు. కానీ సాయంత్రానికల్లా ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. అసలు ఇలా ప్రేక్షకులు ఆలస్యంగా రావడానికి గల కారణం ఏంటి? 'అని అశ్విన్.. అశ్వత్ను అడిగాడు.
దానికి అశ్వత్ బదులిస్తూ.. ఐదు రోజులకు కలిపి ఇచ్చే సీజన్ టికెట్ను ఎవరూ తీసుకోవడం లేదని, డే టికెట్స్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పాడు. టెస్ట్ మ్యాచ్లు 3 నుంచి 4 రోజుల్లోనే ముగుస్తుండటంతో డే టికెట్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపాడు. దాంతో డే టికెట్ కొనేవారి సంఖ్య బాగా పెరిగిపోయిందని, ఆ క్రౌడ్ అంతా మైదానంలోకి వచ్చే సరికి ఆలస్యమైందని వివరించాడు.
ఒక్క కౌంటర్ ఉండటం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నాడు. టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారని, శనివారం, ఆదివారం భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని అశ్వత్ తెలిపాడు. మ్యాచ్కు హాజరైన ప్రేక్షకులను అశ్విన్ ప్రశంసించాడు. ఆటపై ఉన్న మక్కువతో మ్యాచ్కు వచ్చారని చెప్పాడు.
తాను ఆడిన అత్యుత్తమ పిచ్ కూడా ఇదేనని తెలిపాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టు కూడా ఇదే పిచ్ ఆడాలని కోరుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు పిచ్ క్యూరెట్ తనతో మాట్లాడాడని, ఉదయం పేసర్లకు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాత బ్యాటింగ్కు సహకరిస్తుందని, తర్వాత స్పిన్ అవుతుందని చెప్పాడని, తొలి రోజు బౌన్స్ ఉంటుందని కూడా తెలిపాడని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.