భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్.. పలు రికార్డులను నమోదు చేశాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లతో చెలరేగిన అశ్విన్.. మొత్తం 522 వికెట్లతో వెస్టిండీస్ దిగ్గజం కోట్నీ వాల్ష్(519)ను వెనక్కినెట్టాడు.
టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్(800), షేన్ వార్న్(708), జేమ్స్ అండర్సన్(704), అనిల్ కుంబ్లే(619), స్టువర్ట్ బ్రాడ్(604), మెక్గ్రాత్(563), నాథన్ లయన్(530) అశ్విన్ కంటే ముందున్నారు. మరో 9 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ను కూడా అశ్విన్ ధాటేస్తాడు.

డబ్ల్యూటీసీలో తొలి బౌలర్గా..
ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో అత్యధిక సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్గా కూడా అశ్విన్ రికార్డు సాధించాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో మొత్తం 11 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో నాథన్ లయన్(10)ను అతను అధిగమించాడు. ఈ జాబితాలో అశ్విన్(11), లయన్(10)తో పాటు కమిన్స్(8), బుమ్రా(7), హజిల్ వుడ్(6) టీమ్ సౌథీ(6) ఉన్నారు.
కుంబ్లే రికార్డ్ బద్దలు..
భారత్ తరఫున నాలుగో ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ అశ్విన్ రికార్డ్ సాధించాడు. ఇప్పటి వరకు అతను నాలుగో ఇన్నింగ్స్ల్లో మొత్తం 99 వికెట్లు తీసాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే 94 వికెట్ల ఘనతను అధిగమించాడు.
భారత్ తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన అత్యధిక వయస్కుడిగా కూడా అశ్విన్ రికార్డ్ సాధించాడు. ప్రస్తుతం అశ్విన్ వయసు 38 ఏళ్ల ఏడు రోజులు. ఈ క్రమంలో 69 ఏళ్ల క్రితం విను మన్కడ్ నెలకొల్పిన ఈ రికార్డును అశ్విన్ అధిగమించాడు.
షేన్ వార్న్ రికార్డ్ సమం..
టెస్ట్ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న రెండో బౌలర్గా అశ్విన్ నిలిచాడు. మొత్తం 101 టెస్ట్ల్లో అశ్విన్ 37 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీదరణ్(67) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో షేన్ వార్న్, అశ్విన్ కొనసాగుతున్నారు. షేన్ వార్న్ 143 టెస్ట్ల్లో ఈ ఫీట్ సాధించాడు.
భారత్ ఘన విజయం..
అశ్విన్ అసాధారణ ప్రదర్శనతో భారత్ 280 పరుగుల తేడాతో తొలి టెస్ట్లో విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రవిచంద్రన్ అశ్విన్(6/88) ధాటికి 234 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(127 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 82) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్తో పాటు జడేజా(3/58) మూడు వికెట్లు తీసాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.