బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో రోహిత్ సేన 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రవిచంద్రన్ అశ్విన్(6/88) ధాటికి 234 పరుగులకే కుప్పకూలింది.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(127 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 82) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్తో పాటు జడేజా(3/58) మూడు వికెట్లు తీసాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.

రఫ్ఫాడించిన అశ్విన్, జడేజా..
158/4 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 62.1 ఓవర్లలోనే కుప్పకూలింది. ఓవైపు అశ్విన్.. మరోవైపు జడేజా తమ బంతులతో బంగ్లాదేశ్ బ్యాటర్లను చెడుగుడు ఆడారు. ఈ ఇద్దరి ధాటికి 24 ఓవర్లలోనే బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయింది. పేసర్లను సమర్థవంతంగా ఆడిన బంగ్లాదేశ్ ఓవర్నైట్ బ్యాటర్లు షకీబ్ అల్ హసన్, నజ్ముల్ షాంటోలు క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేశారు.
కానీ అశ్విన్ను రంగంలోకి దింపిన రోహిత్ ఫలితాన్ని రాబట్టాడు. అశ్విన్ వేసిన తన తొలి ఓవర్లోనే షకీబ్ అల్ హసన్ పెవిలియన్ చేరాడు. అనంతరం లిట్టన్ దాస్ను జడేజా ఔట్ చేయగా.. మెహ్దీ హసన్ మీరాజ్ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు నిలకడగా ఆడుతూ సెంచరీ దిశగా సాగుతున్న బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటోకు రోహిత్ తన మార్క్ కెప్టెన్సీతో చెక్ పెట్టాడు.
జడేజా సాయంతో ఊరించే బంతి వేయించి బుట్టలో వేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన టస్కిన్ అహ్మద్ను అశ్విన్ ఔట్ చేయగా.. హసన్ మహముద్ను క్లీన్ బౌల్డ్ చేసిన జడేజా భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
భారీ ఆధిక్యంతో..
భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటవ్వగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో రోహిత్ సేనకు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్లో అశ్విన్(113), రవీంద్ర జడేజా(86) సత్తా చాటితే.. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా(4/50) నిప్పులు చెరిగాడు.
రెండో ఇన్నింగ్స్ను టీమిండియా 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ ( 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 నాటౌట్), రిషభ్ పంత్ (128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109) శతకాలతో రాణించారు. ఈ గెలుపుతో రెండు టెస్ట్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తద్వారా తమ టెస్ట్ సీజన్ను రోహిత్ సేన ఘనంగా ప్రారంభించింది.
బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటిన లోకల్ భాయ్ అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది.