భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు రంగం సిద్దమైంది. సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. దాదపు 40 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మైదానంలోకి అడుగుపెట్టనుంది. చెన్నై వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఇదే తొలి టెస్ట్ సిరీస్ కావడం విశేషం. ఇప్పటికే చెన్నై చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. గంటల కొద్దీ నెట్స్లో చెమటోడ్చుతున్నారు. పసికూన బంగ్లాదేశ్ అని తక్కువ అంచనా వేయకుండా అన్ని విధాలుగా సన్నదమవుతున్నారు.

మరోవైపు గంభీర్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్మెంట్ కూడా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. అయితే తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ల్లో ఎవరు? ఆడుతారు? ముగ్గురు స్పిన్నర్ల..? ముగ్గురు పేసర్లా? అనేది ప్రశ్నార్థకంగా మారాయి. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నారనేదానిపై క్లారిటీ ఉన్నప్పటికీ ఎక్స్ట్రా పేసరా? స్పిన్నరా? అనేదానిపై స్పష్టత లేదు.
ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతున్నారని కొన్ని కథనాలు చెబితే.. ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందని పీటీఐ పేర్కొంది. సొంతగడ్డపై టీమిండియా ఎప్పుడూ ముగ్గురు స్పిన్నర్లతోనే ఆడుతుందని రాసుకొచ్చింది. అయితే జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ల రూపంలో నలుగురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు.
ఈ నలుగురిలో ఏ ముగ్గురు ఆడుతారు? అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే బ్యాటింగ్ సామర్థ్యంతో పాటు అనుభవం ఉన్న కారణంగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో చోటు ఖాయం. మూడో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మధ్య పోటీ నెలకొంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో కుల్దీప్ యాదవ్కు తొలి ప్రాధాన్యత దక్కనుంది.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్ బరిలోకి దిగారు. అయితే రెండో టెస్ట్ అనంతరం జడేజా గాయపడటంతో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ బెంచ్కు పరిమితమవ్వగా.. కుల్దీప్ యాదవ్ నాలుగు మ్యాచ్ల్లో 19 వికెట్లు తీసాడు. ఈ లెక్కన బంగ్లాదేశ్తో సిరీస్లోనూ కుల్దీప్ యాదవ్కే ప్రాధాన్యత దక్కనుంది.