సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. మూడు టీ20ల సిరీస్ను కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 74), రింకూ సింగ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 53)విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32) కూడా దూకుడుగా ఆడాడు.

బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. రిషద్ హోస్సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు. 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును నితీష్-రింకూ 108 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహ్మదుల్లా(39 బంతుల్లో 3 సిక్స్లతో 41) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, నితీష్ కుమార్ రెడ్డి రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.
చెలరేగిన భారత బౌలర్లు..
భారీ లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్లోనే ఓపెనర్ పర్వేజ్ హోస్సేన్(16) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(11) వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే మరో ఓపెనర్ లిటన్ దాస్(14)ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో బంగ్లాదేశ్ పవర్ ప్లేలో 3 వికెట్లకు 43 పరుగులే చేసింది.
అనంతరం టౌహిడ్ హృదయ్(2)ను అభిషేక్ శర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో మెహ్దీ హసన్ మీరాజ్(16), మహ్మదుల్లా ఆచితూచి ఆడారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ఈ జోడీని రియాన్ పరాగ్ విడదీసాడు. మెహ్దీ హసన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
మహ్మదుల్లా ఒంటరి పోరాటం..
క్రీజులోకి వచ్చిన జాకీర్ అలీ(1)ని మయాంక్ యాదవ్ పెవిలియన్ చేర్చగా.. రిషద్ హోస్సేన్ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్తో ఈ వికెట్ అందుకున్నాడు. దాంతో బంగ్లాదేశ్ 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మహ్మదుల్లా భారీ సిక్సర్లతో ఒంటరి పోరాటం చేశాడు. తంజైమ్ షకీబ్ను నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి అంతర్జాతీయ క్రికెట్లో వికెట్ల ఖాతా తెరిచాడు. ఆఖరి ఓవర్లో నిలకడగా ఆడుతున్న మహ్మదుల్లా(41)ను కూడా నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.