టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగానే తాను మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయగలిగానని యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అన్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడేందుకు లైసెన్స్ ఇచ్చారని తెలిపాడు. బంగ్లాదేశ్తో బుధవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 74), రింకూ సింగ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 53)విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32) కూడా దూకుడుగా ఆడాడు.

బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. రిషద్ హోస్సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహ్మదుల్లా(39 బంతుల్లో 3 సిక్స్లతో 41) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, నితీష్ కుమార్ రెడ్డి రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.
అరంగేట్రం చేసిన రెండో టీ20లోనే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన నితీష్ కుమార్ రెడ్డి.. తన పెర్ఫామెన్స్ క్రెడిట్ గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్కు ఇచ్చాడు. 'టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తుండటం గొప్ప అనుభూతినిస్తోంది. ప్రతీది గొప్పగా అనిపిస్తోంది. నా అత్యుత్తమ ప్రదర్శనకు కారణం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్. వారే నాకు ఫియర్లెస్ క్రికెట్ ఆడేందుకు లైసెన్స్ ఇచ్చారు.
ఈ మ్యాచ్లో సెట్ అయ్యేందుకు ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నా. మహ్మదుల్లా నోబాల్ వేసిన తర్వాత పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారాయి. భారత జట్టుకు ఆడుతుండటం గొప్ప అనుభూతినిస్తోంది. ఇదే జోరును కొనసాగించాలనుకుంటున్నాను. ఇలాంటి ప్రదర్శనలను పునరావృతం చేయాలనుకుంటున్నాను.'అని నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.