టీమిండియా యువ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. బంగ్లాదేశ్తో బుధవారం జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ షాట్కు నితీష్ కుమార్ రెడ్డి కుప్పకూలాడు. నాన్ స్ట్రైకర్గా నితీష్ కుమార్ రెడ్డి వీపు భాగంలో బంతి బలంగా తాకింది.
నొప్పితో విలవిలలాడిన నితీష్ కుమార్ రెడ్డిని ఫిజియోలు పరిశీలించి ప్రథమ చికిత్స అందించారు. గాయం తీవ్రత తక్కువగానే ఉండటంతో నితీష్ కుమార్ రెడ్డి తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. బంతి ముఖానికి లేదా మరో చోటునా తాకినా.. నితీష్ కుమార్ రెడ్డికి తీవ్ర గాయమయ్యేది. టస్కిన్ అహ్మద్ వేసిన నాలుగో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ ఆఖరి బంతిని సూర్యకుమార్ యాదవ్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. నితీష్ కుమార్ రెడ్డికి బలంగా తాకింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
Surya Kumar Yadav hits hard but straight to Nitish Kumar Reddy #INDvBAN pic.twitter.com/imbbOKk3kh
— Caught & Bowled (@caught1bowled) October 9, 2024
సూర్యకుమార్ యాదవ్(8) విఫలమైనా.. నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 74), రింకూ సింగ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 53)విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును నితీష్-రింకూ 108 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు.
హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32) కూడా దూకుడుగా ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. రిషద్ హోస్సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు.