వన్డే ప్రపంచకప్( World Cup 2023)లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ తీవ్ర చర్చనీయాంశమైంది. వన్డే కెరీర్లో కోహ్లీ సాధించిన ఈ 48వ సెంచరీపై తీవ్ర దుమారం రేగింది. సెంచరీ కోసం విరాట్ కోహ్లీ భారత విజయాన్ని ఆలస్యం చేశాడని, అంపైర్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి అతనికి సహకరించాడనే ఆరోపణలు వచ్చాయి.
వాస్తవానికి ఈ మ్యాచ్లో భారత్ విజయం కంటే కోహ్లీ సెంచరీ అందుకోవడంపైనే ఉత్కంఠ నెలకొంది. భారత్ విజయం ఖాయమవ్వడంతో సెంచరీ చేయడంపై ఫోకస్ పెట్టాలని కేఎల్ రాహుల్ సూచించాడు. ససేమిరా అన్న కోహ్లీని తానే ఒప్పించానని మ్యాచ్ అనంతరం రాహుల్ స్పష్టం చేశాడు.

భారత్ విజయానికి 2 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ సెంచరీ పూర్తవ్వడానికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో 42వ ఓవర్ బౌలింగ్ చేసిన నసుమ్ తొలి బంతిని వైడ్గా వేసాడు. దాంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కానీ అంపైర్ వైడ్గా ప్రకటించలేదు. దాంతో కోహ్లీ డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది శతక గర్జన చేశాడు.
కోహ్లీ కోసమే అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో వైడ్ ఇవ్వలేదని అంతా అనుకున్నారు. అయితే అతను నిబంధనల మేరకే ఈ బంతిని వైడ్గా ప్రకటించలేదనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. క్రికెట్ నియమాలను మార్చే మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) 2022లో పరిమిత ఓవర్ల క్రికెట్లో వైడ్ విషయంలో పలు మార్పులు చేసింది.
ఈ మోడర్న్ క్రికెట్లో బ్యాటర్లు.. బౌలర్లు బంతి వేయకముందే అటు ఇటు కదులుతుండటం.. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్స్ ఆడే ప్రయత్నంలో క్రీజులో డ్యాన్స్ చేస్తుండటంతో ఈ మార్పులు తీసుకొచ్చింది. ఇలా బౌలర్ బంతి వేయకముందే బ్యాటర్ కదిలినప్పుడు వారి పక్క నుంచే వెళ్లిన బంతి వైడ్ ఇవ్వడం సమంజసం కాదని భావించిన ఎంసీసీ ఈ నిబంధనను మార్చింది.
క్రికెట్ నిబంధనల్లోని 22.1 రూల్ను సవరించింది. బౌలర్ తన రనప్ ప్రారంభించినప్పుడు బ్యాటర్ మూవ్మెంట్ ఇచ్చి.. బ్యాటింగ్ పొజిషన్కు వెళ్లినా.. కదిలిన చోటునే పరిగణలోకి తీసుకోవాలని, ఆ ప్లేస్ను బట్టే వైడ్ నిర్ణయాన్ని ప్రకటించాలని మార్పు చేసింది.
నిన్నటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ నసుమ్ బౌలింగ్ రన్నప్ ప్రారంభించగానే లెగ్ స్టంప్ వైపు జరిగి.. బంతి పడగానే ముందుకు జరిగాడు. కొత్త నిబంధన ప్రకారం కోహ్లీ వెనక్కి జరిగి.. ముందుకు రావడంతో వైడ్ కాదు. కెటిల్ బరో కూడా ఇదే రూల్ ప్రకారం వైడ్ ఇవ్వలేదు.