పేలవ బ్యాటింగ్తో పాటు చెత్త బౌలింగ్తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అన్నాడు. భారత్తో ఉప్పల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో బంగ్లాదేశ్ 133 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో మూడు టీ20ల సిరీస్లోనూ బంగ్లాదేశ్ 0-3తో క్లీన్ స్వీప్కు గురైంది.
ఇప్పటికే టెస్ట్ సిరీస్ను 0-2తో కోల్పోయిన బంగ్లాదేశ్.. ఒక్క విజయం లేకుండానే భారత పర్యటనను ముగించింది. ఆఖరి టీ20 పరాజయం అనంతరం మాట్లాడిన నజ్ముల్ షాంటో.. గట్టి పోటీనవ్వగలమనే నమ్మకాన్ని పెంచుకోవాలని అభిప్రాయపడ్డాడు.

'మేం మా అత్యుత్తమ క్రికెట్ ఆడలేదు. మూడు మ్యాచ్ల్లో మా బ్యాటింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేదు. ఈ రోజు బౌలర్లంతా విఫలమయ్యారు. గట్టి పోటీని ఇవ్వగలమనే విశ్వాసం పెంచుకోవాలి. టౌహిడ్ హృదయ్ బ్యాటింగ్ మాకు లభించిన సానుకూలాంశం. అతను అద్భుతంగా ఆడాడు. టాపార్డర్ బ్యాటర్లు చాలా మెరుగవ్వాలి.'అని నజ్ముల్ షాంటో చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 111) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రియాన్ పరాగ్( 13 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 34), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 47) మెరుపులు మెరిపించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మదుల్లా, టస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేసి ఓటమిపాలైంది. టౌహిడ్ హృదయ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 63 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(25 బంతుల్లో 8 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు.
భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా.. మయాంక్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు.