పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోవడంతో పాటు చెత్త ఫీల్డింగ్ తమ ఓటమిని శాసించిందని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు తీసినా.. ఫీల్డింగ్లో తప్పిదాలు చేయకున్నా ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది.
ఫీల్డింగ్ తప్పిదాలు..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన నజ్ముల్ హోస్సేన్ షాంటో.. ఫీల్డింగ్ తప్పిదాలు విజయవకాశాలను దెబ్బతీసాయని తెలిపాడు. 'పవర్ ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోవడం మాకు తీరని నష్టం చేసింది. కానీ హృదయ్, జకేర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి పోరాడే లక్ష్యాన్ని అందించారు. కానీ మేం ఫీల్డింగ్లో చాలా తప్పిదాలు చేశాం. కీలకమైన క్యాచ్లను వదిలేయడంతో పాటు పలు రనౌట్ అవకాశాలను చేజార్చుకున్నాం. ఈ క్యాచ్లు పట్టినా.. రనౌట్లు చేసినా ఫలితం మరోలా ఉండేది.

వారిని ఔట్ చేసి ఉంటే..
హృదయ్, జకేర్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తదుపరి మ్యాచ్ల్లోనూ వారు ఇదే జోరును కొనసాగిస్తారని ఆశిస్తున్నా. ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకోవాల్సిందని నేను అనుకోవడం లేదు. కొత్త బంతితో వికెట్లు తీసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇటీవలే మేం పాకిస్థాన్లో ఆడాం. రావల్పిండి పరిస్థితులను మా ఆటగాళ్లు అడాప్ట్ చేసుకుంటారని నేను భావిస్తున్నా.'అని నజ్ముల్ షాంటో చెప్పుకొచ్చాడు.
టాహిడ్ శతకం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు కుప్పకూలింది. టౌహిడ్ హృదయ్(118 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 100) సెంచరీతో రాణించగా.. జకేర్ అలీ(114 బంతుల్లో 4 ఫోర్లతో 68) హాఫ్ సెంచరీతో అతనికి అండగా నిలిచాడు. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్ను జకేర్ అలీ, టౌహిడ్ హృదయ్ ఆదుకున్నారు. 6వ వికెట్కు 154 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(5/53) ఐదు వికెట్లు తీయగా.. హర్షిత్ రానా(3/31) మూడు, అక్షర్ పటేల్(2/43) రెండు వికెట్లు పడగొట్టారు.
శుభ్మన్ గిల్ సెంచరీ..
అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(36 బంతుల్లో 7 ఫోర్లతో 41), కేఎల్ రాహుల్(47 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.