మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతోనే మూల్యం చెల్లించుకున్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో అన్నాడు. భారత్తో కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. రెండో టెస్ట్లో రెండున్నర రోజుల ఆటను వరణుడు మింగేయగా.. అటాకింగ్ గేమ్తో టీమిండియా ఫలితం రాబట్టింది.
డ్రా చేసుకునే అవకాశం ఉన్నా బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన నజ్ముల్ షాంటో.. తమ బ్యాటర్లు సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడుతూ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నాడు. 'రెండు టెస్ట్ల్లో మేం బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. కాన్పూర్ వికెట్పై మేం ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. మా బ్యాటర్లంతా 30-40 బంతులాడి ఔటవుతున్నారు.

టెస్ట్ మ్యాచ్లో బ్యాటర్లు భారీ స్కోర్లు చేయడం ముఖ్యం. తొలి టెస్ట్లో అశ్విన్, జడేజా బ్యాటింగ్ చేసినట్లు ఆడాలి. ఆ మ్యాచ్లో ఈ ఇద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్ యూనిట్లో కొన్ని కీలక అంశాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కీలకమైన వికెట్లు తీయడంపై కసరత్తు చేయాలి.
జడేజా-అశ్విన్ భాగస్వామ్యం మా ఓటమిని శాసించింది. ఈ మ్యాచ్లో మోమినల్ హక్ అద్భుతంగా ఆడాడు. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు అతనికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడనుంది. రెండు ఇన్నింగ్స్లో మీరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.'అని నజ్ముల్ షాంటో చెప్పుకొచ్చాడు.
95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 98 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(8), శుభ్మన్ గిల్(6) విఫలమైనా.. యశస్వి జైస్వాల్(45 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 51)హాఫ్ సెంచరీతో రాణించాడు. విన్నింగ్ షాట్ కోసం ప్రయత్నించి యశస్వి జైస్వాల్ ఔటవ్వగా.. రిషభ్ పంత్ సాయంతో విరాట్ కోహ్లీ(25 నాటౌట్) భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్తో 107 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లు తీయగా... మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వ్యూహాత్మకంగా 34.4 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా.. బంగ్లాదేశ్పై 52 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్, జడేజా, జస్ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ షెడ్మన్ ఇస్లామ్(101 బంతుల్లో 10 ఫోర్లతో 50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా..ముష్ఫీకర్ రహీమ్(63 బంతుల్లో 37) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.