బ్యాటింగ్ వైఫల్యంతోనే భారత్తో తొలి టెస్ట్లో ఓటమిపాలయ్యామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అన్నాడు. బౌలర్లు అద్భుతంగా రాణించారని, కానీ బ్యాటింగ్ విభాగం మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. భారత బ్యాటర్ల అసాధారణ బ్యాటింగ్ కూడా తమ ఓటమిని శాసించిందన్నాడు.
ఆదివారం ముగిసిన ఈ టెస్ట్లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 234 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్(6/88) ఆరు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(127 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 82) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన నజ్ముల్ హోస్సేన్ షాంటో.. ఓడినా కొన్ని సానుకూలాంశాలు లభించాయని చెప్పాడు. 'మ్యాచ్ ప్రారంభమైన 2-3 గంటలు హసన్ మహముద్, టస్కిన్ అహ్మద్, నహిద్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసారు. ఈ మ్యాచ్లో మాకు లభించిన సానుకూలాంశం ఇదే. అయినా భారత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా అద్భుత భాగస్వామ్యంతో భారీ స్కోర్ నమోదు చేసింది. మా పేసర్లు అద్భుతంగా రాణించారు. ప్రతీ ఒక్కరు తమ బౌలింగ్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కొత్త బంతితో నిప్పులు చెరిగారు. గత కొన్ని సిరీస్లుగా బౌలింగ్లో మేం మెరుగైన ప్రదర్శన చేస్తున్నాం. అదే నిలకడను మేం కొనసాగించాల్సిన అవసరం ఉంది.
ఓ బ్యాటర్గా నేను పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ మ్యాచ్లో నా బ్యాటింగ్ను ఆస్వాదించాను. ఫలితం గురించి ఆలోచించకుండా వీలైనంతవరకు పోరాడాలనుకున్నాను. మా విధానాన్ని కొనసాగిస్తూ.. బలాలను నమ్ముకొని లక్ష్యం కోసం ప్రయత్నించాలి. బౌలర్లు గొప్ప ప్రదర్శన చేశారు. బ్యాటర్లు కూడా సత్తా చాటుతారని ఆశిస్తున్నా.'అని నజ్ముల్ హొస్సేన్ షాంటో అన్నాడు.
158/4 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 62.1 ఓవర్లలోనే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్తో పాటు జడేజా(3/58) మూడు వికెట్లు తీసాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటవ్వగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. బ్యాటింగ్లో అశ్విన్(113), రవీంద్ర జడేజా(86) సత్తా చాటితే.. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా(4/50) నిప్పులు చెరిగాడు.
రెండో ఇన్నింగ్స్ను టీమిండియా 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ ( 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 నాటౌట్), రిషభ్ పంత్ (128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109) శతకాలతో రాణించారు. ఈ గెలుపుతో రెండు టెస్ట్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తద్వారా తమ టెస్ట్ సీజన్ను రోహిత్ సేన ఘనంగా ప్రారంభించింది.