ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆట చివర్లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్.. స్పిన్నర్గా మారేందుకు సిద్దమయ్యాడు. వెలుతురులేమి కారణంగా మూడో రోజు ఆట నిర్ణీత సమయం కన్నా ముందే ముగిసిన విషయం తెలిసిందే.
అయితే చివర్లో వెలుతురులేమి కారణంగా అంపైర్లు స్పిన్ బౌలింగ్ చేసేందుకు మాత్రమే అనుమతించారు. దాంతో తాను స్పిన్ బౌలింగ్ చేస్తానని సిరాజ్ ముందుకొచ్చాడు. కానీ రోహిత్ శర్మ అంగీకరించలేదు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 38వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ సిరాజ్ ఈ ఓవర్ బౌలింగ్ చేయగా... రెండు బంతులు వేయగానే బంగ్లాదేశ్ బ్యాటర్లు షకీబ్ అల్ హసన్, నజ్ముల్ షాంటో వెలుతురు సరిపోవడం లేదని అంపైర్లకు ఫిర్యాదు చేశారు.

దాంతో అంపైర్లు స్పిన్ బౌలర్లతో బౌలింగ్ చేయించాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సూచించాడు. వెంటనే సిరాజ్ మిగిలిన నాలుగు బంతులను స్పిన్ బౌలింగ్ చేస్తానని చెప్పాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఒప్పుకోలేదు. సిరాజ్ ఓవర్ పూర్తయ్యేవరకు అనుమతించాలని పట్టుబట్టాడు. కానీ అంపైర్ వినలేదు.
ఇటీవల ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో వెలుతురు సరిగ్గా లేకపోతే అంపైర్లు స్పిన్ బౌలింగ్కు మాత్రమే అనుమతిచ్చారని గుర్తు చేశారు. పేస్ బౌలర్ అయిన క్రిస్ వోక్స్ స్పిన్ బౌలింగ్ చేశాడని తెలిపారు. స్పిన్ బౌలింగ్ చేసేందుకు రోహిత్ అంగీకరించడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు.
ఈ మ్యాచ్లో భారత్ విజయం దిశగా సాగుతోంది. మరో ఆరు వికెట్లు సాధిస్తే గెలుపు లాంఛనమవుతుంది. రవిచంద్ర్ అశ్విన్ (3/63) ధాటికి.. మూడో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసింది. విజయానికి బంగ్లాదేశ్ 357 పరుగుల దూరంలో ఉంది.
ప్రస్తుతం క్రీజులో నజ్ముల్ హోస్సెన్ షాంటో(54 బ్యాటింగ్)తో పాటు షకీబ్ అల్ హసన్(5 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు 81/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ ( 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 నాటౌట్), రిషభ్ పంత్ (128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109) శతకాలతో చెలరేగారు.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటవ్వగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో రోహిత్ సేనకు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్లో అశ్విన్(113), రవీంద్ర జడేజా(86) సత్తా చాటితే.. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా(4/50) నిప్పులు చెరిగాడు.