టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో బౌలర్గా నిలిచాడు. బంతులపరంగా ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్తో దుబాయ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు.
తొలి బౌలర్గా..
ఈ మ్యాచ్లో జాకెర్ అలీని క్యాచ్ ఔట్ చేయడం ద్వారా మహమ్మద్ షమీ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 104 వన్డేల్లో మహమ్మద్ షమీ 200 వికెట్లను తీయగా.. మిచెల్ స్టార్క్ 102 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్(107 మ్యాచ్లు), బ్రెట్లీ(112), అలన్ డోనాల్డ్(117) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. బంతుల పరంగా మాత్రం మహమ్మద్ షమీనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించాడు.

అతను 5126 బంతులు వేసి 200 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ 5240 బాల్స్లో ఈ ఫీట్ సాధించాడు. సక్లెయిన్ ముష్తాక్(5451), బ్రెట్ లీ(5640), ట్రెంట్ బౌల్ట్(5783), వకార్ యూనిస్(5883) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
జహీర్ ఖాన్ రికార్డ్ బద్దలు..
ఐసీసీ వైట్బాల్ టోర్నీల్లో మహమ్మద్ షమీ 72 వికెట్లతో టాప్ ఇండియన్ బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో అతను జహీర్ ఖాన్ రికార్డ్ను అధిగమించాడు. 18 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ల్లో 55 వికెట్లు తీసిన షమీ.. 14 టీ20 ప్రపంచకప్ మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న షమీ 3 వికెట్లు తీసి మొత్తం 33 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.
జహీర్ ఖాన్ 44 ఐసీసీ టోర్నీ మ్యాచ్ల్లో 71 వికెట్లు తీసాడు. జస్ప్రీత్ బుమ్రా(68 వికెట్లు), రవీంద్ర జడేజా(65), రవిచంద్రన్ అశ్విన్(59) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.