
మిర్పూర్: గత కొంతకాలంగా నిలకడలేమి ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఎంట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. అచ్చొచ్చిన టెస్ట్ ఫార్మాట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. బంగ్లాదేశ్తో రెండో టెస్ట్లో పంత్ ఆకాశమే హద్దుగా బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 72 పరుగులకే మూడు వికెట్ల కోల్పోయి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న జట్టును రిషభ్ పంత్ ఒంటి చేత్తో గట్టెక్కించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(24) ఔటైనా.. శ్రేయస్ అయ్యర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు.
ఈ క్రమంలో49 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిషభ్ పంత్ సెంచరీకి 14 పరుగుల దూరంలో నిలిచాడు. రిషభ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియా 61 ఓవర్లలో 226/4 పరుగులు చేసి టీ బ్రేక్కు వెళ్లింది. ముఖ్యంగా మెహ్దీ హసన్ మీరాజ్ వేసిన 58వ ఓవర్ చివరి బంతికి రిషభ్ పంత్ కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. సింగిల్ హ్యాండ్తో పంత్ కొట్టిన సిక్స్కు మెహ్దీ హసన్ నోరెళ్ల బెట్టాడు. పంత్ హ్యాండ్ పవర్కు బంతి 100 మీటర్ల దూరంలో పడింది. ఈ ఓవర్లోనే రెండు సిక్స్లు బాదిన పంత్.. మొత్తం 5 సిక్సర్లతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు.
19/0 ఓవర్ నైట్ స్కోర్ రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. తైజుల్ ఇస్లామ్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లు కేఎల్ రాహుల్(10),శుభ్మన్ గిల్(24)లను పెవిలియన్ చేర్చాడు. ఈ ఇద్దరూ ఎల్బీగా వెనుదిరగడం గమనార్హం. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, పుజారా కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. తైజుల్ ఇస్లామ్ బౌలింగ్లో పుజారా(24) క్యాచ్ ఔటవ్వగా.. విరాట్ కోహ్లీని టస్కిన్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు. 134 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును ముందుకు తీసుకెళ్తున్నారు.