ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్కు హాజరైన బంగ్లా సూపర్ ఫ్యాన్ 'టైగర్ రాబి'పై దాడి జరిగినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని కాన్పూర్ పోలీసులు స్పష్టం చేశారు. టైగర్ రాబిని ఎవరూ కొట్టలేదని, అనారోగ్యంతో అతను కిందపడిపోయాడని పేర్కొన్నారు. శుక్రవారం కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కాగా.. టాస్ ఓడిన బంగ్లాదేశ్ బ్యాటింగ్కు దిగింది.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రోజు ఆట ఆరంభంలో టైగర్ రాబికి, స్థానిక టీమిండియా అభిమానులకు గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి. సీ బ్లాక్లో ఉన్న రాబి బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఊపుతూ.. మద్దతుగా నినాదాలు చేశాడని, దాంతో స్థానిక భారత అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురై అతనితో వాగ్వాదానికి దిగారని, లంచ్ బ్రేక్ సమయంలో టైగర్ రాబీపై బౌతిక దాడికి పాల్పడ్డారని కూడా ప్రచారం జరిగింది.

అస్వస్థతకు గురైన టైగర్ రాబీని పోలీసులు మైదానం బయటకు తీసుకెళ్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే టైగర్ రాబీపై ఎవరూ దాడి చేయలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని కాన్పూర్ పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు టైగర్ రాబీ సెన్సేషనల్ అవ్వాలనే ఉద్దేశంతోనే తనపై దాడి జరిగినట్లు నటించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
ఆసుప్రతికి వెళ్లే సమయంలో టైగర్ రాబీ మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి చేశారని, పొత్తికడుపుతో వీపుపై బలంగా కొట్టారని, దీంతో ఊపిరి తీసుకోవడం కష్టమైందని తెలిపాడు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు అతనిపై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు. టైగర్ రాబీపై దాడి చేసినట్లు ఎక్కడా కనపించలేదని చెప్పారు.
వార్తల్లో నిలిచేందుకు టైగర్ రాబీ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ అనేక సార్లు స్థానిక అభిమానులతో గొడవకు దిగేందుకు ప్రయత్నించాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లోనూ తమిళం అర్థం కాక అక్కడి ఫ్యాన్స్తో గొడవకు దిగాడని గుర్తు చేశారు. ఈ ఘటనను బంగ్లాదేశ్ మీడియా పెద్దదిగా చూపిస్తుందని, టైగర్ రాబీపై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లను నిర్వహించకుండా అడ్డుకుంటామని హిందు మహా సభ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాన్పూర్ మైదానానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. భారత్, బంగ్లా ఆటగాళ్లకు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మైదానంలోనూ భద్రతా సిబ్బందిని పెంచారు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ తొలి రోజు 35 ఓవర్ల ఆటనే సాధ్యమైంది. 55 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్.. రెండో సెషన్ ప్రారంభంలోనే బ్యాడ్ లైట్ రూపంలో అంతరాయం కలిగింది. అనంతరం భారీ వర్షం రావడంతో అంపైర్లు తొలి రోజు ఆటను త్వరగా ముగించారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. క్రీజులో మోమినల్ హక్(40 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్(6 బ్యాటింగ్) ఉన్నారు. నజ్ముల్ హోస్సేన్ షాంటో(31), షెడ్మన్ ఇస్లామ్(24), జకీర్ హసన్(0) దారుణంగా విఫలమయ్యారు.