ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వర్షంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మ్యాచ్ ఆరంభానికి ముందు ఓవైపు మైదాన సిబ్బంది గ్రౌండ్లోని కవర్లు తొలగిస్తుండగా.. మరోవైపు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వచ్చాడు. ఇక కోహ్లీని చూసిన ఓ గ్రౌండ్ స్టాఫ్.. అతని కాళ్లను మొక్కాడు. విరాట్ కోహ్లీ వద్దని వారిస్తున్నా వినకుండా కాళ్లు మొక్కి వెనక్కి వెళ్లిపోయాడు. సాధారణంగా మ్యాచ్ల సందర్భంగా అభిమానులు సెక్యూరిటీ కళ్లు గప్పి తమ అభిమాన ఆటగాళ్లు కాళ్లు మొక్కడం చూస్తుంటాం. కానీ ఓ సపోర్ట్ స్టాప్ ఓ ఆటగాడి పాదాలను టచ్ చేయడం ఇదే తొలిసారి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. కోహ్లీ క్రేజ్ ఇదంటూ అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ ఆడినా.. ఆడకున్నా అతనిపై అభిమానులకు ఉన్న ప్రేమ ఏ మాత్రం తగ్గదని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. క్రీజులో మోమినల్ హక్(40 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్(6 బ్యాటింగ్) ఉన్నారు. నజ్ముల్ హోస్సేన్ షాంటో(31), షెడ్మన్ ఇస్లామ్(24), జకీర్ హసన్(0) దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. శనివారం కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభమైన తొలి మూడు రోజులు వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించింది.