బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. ఆఖరి పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్లో పర్యాటక బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్ట్లోనూ విజయం సాధించాలని భావిస్తోంది.
అయితే కాన్పూర్ మైదానం బలహీనంగా ఉందనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ స్టేడియంలోని ఒక స్టాండ్ బలహీనంగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఓ నివేదిక కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పూర్తి సామర్థ్యం మేరకు అభిమానులు నిండితే.. ఆ స్టాండ్ కూలిపోయే ప్రమాదముందని జాతీయ మీడియా తెలిపింది. దాంతో యూపీ క్రికెట్ అసోసియేషన్ ఆ స్టాండ్లో సగం టికెట్లు మాత్రమే విక్రయిస్తుందని పేర్కొంది.

'కాన్పూర్ స్టేడియంలోని బాల్కానీ సీ స్టాండ్పై పీడబ్ల్యూడీ కొన్ని సమస్యలు లేవనెత్తింది. వాటితో మేం అంగీకరించడం లేదు. అందులో సగాని కంటే ఎక్కువ టికెట్లు విక్రయించడం లేదు. ఈ స్టాండ్ కెపాసిటీ 4800. కేవలం 1700 టికెట్లు మాత్రమే అమ్మాలని నిర్ణయించుకున్నాం. మరమ్మతుల పనులు జరుగుతున్నాయి.'అని యూపీ క్రికెట్ అసోసియేషన్ సీఈవో అంకిత్ ఛటర్జీ మీడియాకు తెలిపారు.
బాల్కనీ సీ పరిస్థితి దారుణంగా ఉందని, మ్యాచ్ జరిగే సమయంలో ఆ స్టాండ్ మూసివేయాలని ఇంజనీర్ల బృందం యూపీ క్రికెట్ అసోసియేషన్కు సూచించినట్లు తెలుస్తోంది. రిషభ్ పంత్తో పాటు ఇతర భారత బ్యాటర్లు ఆ వైపు సిక్స్ కొడితే.. ఆ ఆనందంలో అభిమానులు ఎగిరి గంతేస్తే స్టాండ్ కుప్పకూలుతుందని ఓ ఇంజనీర్ చెప్పినట్లు కూడా ఆ కథనంలో రాసుకొచ్చారు. మరోవైపు ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట తొలి మూడు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగిస్తోందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.