బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(4/50) నిప్పులు చెరిగాడు. దాంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్(64 బంతుల్లో 5 ఫోర్లతో 32), మెహ్దీ హసన్ మీరాజ్(52 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 27 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్(2/30), ఆకాశ్ దీప్(2/19), రవీంద్ర జడేజా(2/19) రెండేసి వికెట్లు తీసారు. ఫలితంగా భారత్కు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (5) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు.

టాస్కిన్ అహ్మద్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(10 బ్యాటింగ్), శుభ్మన్ గిల్(8 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు 339/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు కుప్పకూలింది. ఓవర్నైట్ స్కోర్కు 37 పరుగులు మాత్రమే జోడించింది.
సెంచరీ హీరో అశ్విన్ ఏడు పరుగులే చేయగా.. జడేజా ఒక్క పరుగు కూడా జోడించలేదు. ఆకాశ్ దీప్(17) పరుగులు చేయగా.. బుమ్రా(7) నిరాశపరిచాడు. సిరాజ్(0) నాటౌట్గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్(5/83) ఐదు వికెట్లు తీయగా.. టాస్కిన్ అహ్మద్(3/55) మూడు వికెట్లు పడగొట్టాడు. నహిద్ రాణా, మెహ్దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.