టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. బంగ్లాదేశ్తో చెన్నై వేదికగా ఆదివారం ముగిసిన టెస్ట్లో 5 వికెట్లు తీయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లో ఓ కీలక వికెట్ పడగొట్టాడు.
దాంతో ఈ మ్యాచ్లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో జాకీర్ హసన్ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి బుమ్రా 47 వికెట్లు తీసాడు. మొత్తం 14 మ్యాచ్లు 20 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించాడు.

ఈ జాబితాలో బుమ్రా తర్వాత హాంగ్ కాంగ్ బౌలర్ ఎహ్సన్ ఖాన్ ఉన్నాడు. 26 ఇన్నింగ్స్ల్లో 46 వికెట్లు తీసాడు. వానిందు హసరంగా 20 ఇన్నింగ్స్ల్లో 43 వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్ కూడా 23 ఇన్నింగ్స్ల్లో 43 వికెట్లు పడగొట్టాడు.
వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా మరో 9 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. బంగ్లాదేశ్తో కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పిస్తారని ప్రచారం జరిగినా.. బీసీసీఐ అతన్ని రెండో టెస్ట్కు ఎంపిక చేసింది. కాన్పూర్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుంది. ఎక్స్ట్రా స్పిన్నర్ను తీసుకుంటే.. బుమ్రాను తుది జట్టు నుంచి తప్పించవచ్చు. బుమ్రాను ఆడించాలనుకుంటే మాత్రం మరో పేసర్ బెంచ్కు పరిమితమవుతాడు.