బంగ్లాదేశ్తో మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సంజూ శాంసన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 111) విధ్వంసకర సెంచరీతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సంజూ శాంసన్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.చివర్లో రియాన్ పరాగ్( 13 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 34), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 47) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా రికార్డ్ స్కోర్ నమోదు చేసింది.
భారత బ్యాటర్ల ధాటికి బంగ్లాదేశ్ బౌలర్లు తేలిపోయారు. పోటాపోటీగా పరుగులిచ్చుకున్నారు. తంజిమ్ హసన్ షకీబ్ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మదుల్లా, టస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీసారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే రెండో అత్యధిక స్కోర్.

సంజూ శాంసన్ విధ్వంసం..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ(4) తీవ్రంగా నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో కలిసి సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో పరుగుల మోత మోగించాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలోనే 82/1 స్కోర్ చేసింది.
22 బంతుల్లో సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ సాధించగా.. సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. సంజూ శాంసన్ వరుస సిక్సర్లతో చెలరేగాడు. రిషద్ హోస్సేన్ వేసిన 10 ఓవర్లో వరుసగా ఐదు సిక్స్లు బాది 30 పరుగులు పిండుకున్నాడు.
కండలు చూపిస్తూ..
మెహ్దీ హసన్ వేసిన 13వ ఓవర్లో తొలి బంతిని బౌండరీకి తరలించిన సంజూ శాంసన్ 40 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సంజూ శాంసన్కు ఇదే తొలి సెంచరీ. శతకం పూర్తవ్వగానే తన కండలు చూపిస్తూ సంబరాలు చేసుకోగా.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ అంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది.
ముస్తాఫిజుర్ బౌలింగ్లో సంజూ శాంసన్ క్యాచ్ ఔట్గా వెనుదిరగ్గా.. రెండో వికెట్కు నమోదైన 173 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి రియాన్ పరాగ్ రాగా.. కాసేటికే సెంచరీ దిశగా సాగుతున్న సూర్యకుమార్ యాదవ్ను మహ్మదుల్లా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ దూకుడుగా ఆడుతూ.. జట్టు స్కోర్ను పరుగెత్తించారు.
హార్దిక్ దూకుడు..
భారీ సిక్స్లు బాదిన రియాన్ పరాగ్(34).. టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యానకి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్తో కలిసి హార్దిక్ పాండ్యా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆఖరి ఓవర్లో రిషద్ హోస్సేన్ స్టన్నింగ్ క్యాచ్తో హార్దిక్ పాండ్యా వెనుదిరిగాడు.