సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకొంది. ఫలితం తేలడం కష్టమనుకున్న రెండో టెస్ట్లో రోహిత్ సేన చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. కాన్పూర్ వేదికగా మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఫలితం కోసం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రచించిన వ్యూహం ఫలించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్లో రెండున్నర రోజుల ఆట తుడిచి పెట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయినా అటాకింగ్ గేమ్తో విజయంపై కన్నేసిన టీమిండియా.. ఆసాధారణ ప్రదర్శనతో చారిత్రాత్మక విజయాన్నందుకుంది.

95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 96 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(8), శుభ్మన్ గిల్(6) విఫలమైనా.. యశస్వి జైస్వాల్(45 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 51)హాఫ్ సెంచరీతో రాణించాడు. విన్నింగ్ షాట్ కోసం ప్రయత్నించి యశస్వి జైస్వాల్ ఔటవ్వగా.. రిషభ్ పంత్ సాయంతో విరాట్ కోహ్లీ(25 నాటౌట్) భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
బంగ్లాదేశ్ 146 ఆలౌట్
అంతకుముందు 26/2 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకు కుప్పకూలింది. తొలి సెషన్లోనే బంగ్లా ఇన్నింగ్స్ను ముగించాలనే లక్ష్యాన్ని భారత బౌలర్లు అందుకున్నారు. కెప్టెన్, కోచ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అశ్విన్, జడేజా, జస్ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ షెడ్మన్ ఇస్లామ్(101 బంతుల్లో 10 ఫోర్లతో 50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా..ముష్ఫీకర్ రహీమ్(63 బంతుల్లో 37) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తొలి ఇన్నింగ్స్లో 52 పరుగుల ఆధిక్యం లభించడంతో భారత్ ముందు 95 పరుగుల లక్ష్యమే నమోదైంది. ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉంది.
అటాకింగ్ గేమ్తో..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్తో 107 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లు తీయగా... మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వ్యూహాత్మకంగా 34.4 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా.. బంగ్లాదేశ్పై 52 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.