టీమిండియా చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39 నాటౌట్) విధ్వంసంతో 11.5 ఓవర్లలోనే చేధించింది.
ధనాధన్ బ్యాటింగ్తో టీమిండియా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్పై అత్యధిక పవర్ ప్లే స్కోర్ నమోదు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. సంజూ శాంసన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 29), సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 29)అటాకింగ్ గేమ్తో టీమిండియా పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.

టీ20ల్లో బంగ్లాదేశ్పై ప్రత్యర్థి జట్టు సాధించిన అత్యధిక పవర్ ప్లే స్కోర్ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా తమ రికార్డులనే అధిగమించింది. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో రుతురాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలోని టీమిండియా.. పవర్ ప్లేలో 68/1 స్కోర్ చేసింది. 2019లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. బంగ్లాదేశ్పై పవర్ ప్లేలో 63/0 స్కోర్ నమోదు చేసింది.
తాజాగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా... ఈ రెండు పవర్ ప్లే స్కోర్ల రికార్డులను అధిగమించి ఆల్టైమ్ రికార్డ్ నమోదు చేసింది. అంతేకాకుండా టీ20 క్రికెట్లో 100 ప్లస్ టార్గెట్ను అత్యధిక బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన జట్టుగానూ నిలిచింది. ఈ మ్యాచ్లో టీమిండియా 49 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. 2016లో జింబాబ్వేపై 41 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. తాజా ఈ రికార్డ్ను సూరీడి సేన అధిగమించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహ్దీ హసన్ మీరాజ్(32 బంతుల్లో 3 ఫోర్లతో 35 నాటౌట్), నజ్ముల్ హెస్సేన్ షాంటో(25 బంతుల్లో ఫోర్, సిక్స్తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/31), అర్ష్దీప్ సింగ్(3/14) మూడేసి వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. మయాంక్ యాదవ్(1/21), హార్దిక్ పాండ్యా(1/26), వాషింగ్టన్ సుందర్(1/12)తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 29), సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 29) దూకుడుగా ఆడారు. హార్దిక్ పాండ్యాతో కలిసి తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(16 నాటౌట్) అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్దీ హసన్ మీరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్లు తలో వికెట్ తీసారు.