టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కలిసి పోయారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని, జట్టులోని చాలా మంది ఆటగాళ్లు రెండు గ్రూప్లుగా విడిపోయారని జోరుగా ప్రచారం జరిగింది.
రోహిత్ శర్మ అభిమానులు సైతం ప్రతీ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యాను గేలి చేశారు. ముంబై ఇండియన్స్ కూడా దారుణంగా విఫలమైంది. హార్దిక్-రోహిత్ గొడవలే ముంబై ఇండియన్స్కు నష్టం చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. మైదానంలో ఈ ఇద్దరి ప్రవర్తను కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. కానీ టీమిండియా జెర్సీ ధరించగానే ఈ ఇద్దరూ అన్ని విషయాలు మరిచిపోయారు. జట్టు విషయం కోసం చెమట చిందిస్తున్నారు.

బంగ్లాదేశ్తో శనివారం జరిగిన సూపర్-8 మ్యాచ్లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వికెట్ తీయడం కోసం మాస్టర్ ప్లాన్ రచించారు. దూకుడుగా ఆడిన లిటన్ దాస్(13)2కు ఉచ్చు బిగించారు. ఈ విషయాన్ని పసిగట్టలేకపోయిన లిటన్ దాస్.. హార్దిక్, రోహిత్ శర్మ ఉచ్చులో పడి తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు.
హార్దిక్ పాండ్యా వేసిన ఐదో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని లిటన్ దాస్ ఓవర్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. వెంటనే హార్దిక్ పాండ్యా.. లెగ్ సైడ్ ఫీల్డర్ను ముందుకు పెట్టాలని, గాలికి వ్యతిరేకంగా ఆడేలా బౌలింగ్ చేస్తానని చెప్పాడు. దానికి ఓకే చెప్పిన రోహిత్ శర్మ.. ఫీల్డ్ పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్ను కొంచెం ముందుకు తీసుకొచ్చాడు. హార్దిక్ పాండ్యా చెప్పినట్లుగానే స్లోయర్ బాల్ వేసి లెగ్ సైడ్ ఆడేలా చేశాడు.
లిటన్ దాస్ మరో సిక్సర్ బాదే ప్రయత్నంలో భారీ షాట్ ఆడగా.. గాలికి వ్యతిరేకంగా వెళ్లిన బంతి సూర్యవైపు క్యాచ్ వచ్చింది. ముందుకు పరుగెత్తుకొచ్చిన సూర్య అద్భుతంగా అందుకున్నాడు. దాంతో హార్దిక్తో పాటు రోహిత్ శర్మ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(24 బంతుల్లో 3 సిక్సర్లతో 34), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 37), రిషభ్ పంత్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36) మెరుపులు మెరిపించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్(2/32), రిషద్ హొస్సేన్(2/43) రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ తీసాడు.