బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో రోహిత్ సేన 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడిన టీమిండియా... విజయంతో రెడ్ బాల్ ఫార్మాట్ను ప్రారంభించింది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కాగా.. ఈ విజయంపై అతను సంతోషం వ్యక్తం చేశాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా 6 పదాల్లోనే తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. భారత విజయానికి సంబంధించి ఇన్స్టా వేదికగా రెండు స్టోరీలు పంచుకున్న గౌతమ్ గంభీర్.. మైదానంలోకి అడుగుపెడుతున్న ఆటగాళ్ల ఫొటోను ఒకటి.. ఆట మధ్యలో ఆటగాళ్లు సమావేశమైన మరో ఫొటోను వాటికి జత చేశాడు. రెండింటికి 'అద్భుతమైన ఆరంభం.. వెల్డన్ బాయ్స్'అనే క్యాప్షన్ ఇచ్చాడు.

515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 234 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్(6/88) ఆరు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(127 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 82) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
158/4 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 62.1 ఓవర్లలోనే కుప్పకూలింది. భారత బౌలర్లలో అశ్విన్తో పాటు జడేజా(3/58) మూడు వికెట్లు తీసాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది.

భారత్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటవ్వగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 149 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. బ్యాటింగ్లో అశ్విన్(113), రవీంద్ర జడేజా(86) సత్తా చాటితే.. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా(4/50) నిప్పులు చెరిగాడు.

రెండో ఇన్నింగ్స్ను టీమిండియా 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ ( 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 నాటౌట్), రిషభ్ పంత్ (128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109) శతకాలతో రాణించారు. ఈ గెలుపుతో రెండు టెస్ట్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తద్వారా తమ టెస్ట్ సీజన్ను రోహిత్ సేన ఘనంగా ప్రారంభించింది.