టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాళ్లు అయిన అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లను మళ్లీ భారత జట్టులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసిన విషయం తెలిసిందే.
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యారు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. పేస్ బౌలింగ్ ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు.

ఇప్పుడు ఇదే టీమిండియా మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. నవంబర్లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడి పిచ్లన్నీ పేస్కు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు అయిన ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్, మిచెల్ స్టార్క్లను భారత బ్యాటర్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
సొంతగడ్డపై బంగ్లాదేశ్ పేసర్లనే ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్.. ఆసీస్ గడ్డపై వరల్డ్ బెస్ట్ పేసర్లు ఎలా ఆడుతారనేది? ఇప్పుడు టీమిండియా మేనేజ్మెంట్ను వెంటాడుతున్న ప్రశ్న. ఈ క్రమంలోనే అనుభవం కలిగిన ఆటగాళ్లను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడట.
టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాతో పాటు వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేలను మళ్లీ భారత జట్టులోకి తీసుకొచ్చేందుకు గంభీర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఇరానీ కప్ జరగనుండగా.. అజింక్యా రహానే ముంబై ఇండియన్స్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.
రంజీ ట్రోఫీ 2024 ముంబై గెలవడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. ఇరానీ కప్లోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. అక్టోబర్ 1 నుంచి లక్నో వేదికగా రెస్టాఫ్ ఇండియాతో రంజీ ఛాంపియన్ ముంబై తలపడనుంది. ముంబై తరఫున రహానేతో పాటు శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ కూడా బరిలోకి దిగనున్నారు. రెస్టాఫ్ ఇండియా తరఫున పుజారా ఆడే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఈ నలుగురు మెరుగైన ప్రదర్శన చేస్తే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
రహానే, పుజారా, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్లకు ఆసీస్ గడ్డపై ఆడిన అనుభవం ఉంది. భారత్ గెలిచిన చారిత్రాత్మక సిరీస్లో రహానే టీమిండియాను నడిపించాడు. శార్దూల్ ఠాకూర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే నలుగురు సీనియర్ ఆటగాళ్లను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయాలని గంభీర్ భావిస్తున్నాడట.