బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత్.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితం అసాధ్యమనుకున్న ఈ మ్యాచ్లో టీమిండియా అటాకింగ్ గేమ్తో విజయాన్నందుకుంది. టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యూహాత్మక నిర్ణయాలతో ఆశించిన ఫలితాన్ని సాధించింది.
ఈ సిరీస్ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 పాయింట్స్ టేబుల్లో తమ అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ విజయంపై భారత ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసిన క్షణం ఒకరినొకరు హగ్ చేసుకుంటూ విషెస్ చెప్పుకున్నారు. టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతం గంభీర్.. కోహ్లీని హగ్ చేసుకొని అతన్ని ప్రత్యేకంగా అభినందించాడు. ఈ దృశ్యం నెటిజన్లు ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. మూమెంట్ ఆఫ్ ది డే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్లు మైదానంలోనే చాలా సార్లు గొడవపడ్డారు. అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా గంభీర్.. కోహ్లీపై విమర్శలు గుప్పించేవాడు. ఐపీఎల్ 2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా ఉన్న గంభీర్.. విరాట్ కోహ్లీతో మైదానంలోనే గొడవపడ్డాడు.
ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లడం.. తిట్టుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏడాది తర్వాత ఈ గొడవకు గంభీరే ముగింపు పలికాడు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా.. విరాట్ కోహ్లీని ప్రత్యేకంగా పలకరించి అతనితో మాటలు కదిపాడు. కోహ్లీ సైతం సానుకూలంగా స్పందించడంతో ఈ ఇద్దరూ పాత గొడవలు మరిచి సన్నిహితులుగా కొనసాగుతున్నారు.
MOMENT OF THE DAY...!!! ❤️
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2024
- Gautam Gambhir hugging Virat Kohli. pic.twitter.com/YroNQaSrPz
95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 96 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ(8), శుభ్మన్ గిల్(6) విఫలమైనా.. యశస్వి జైస్వాల్(45 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 51)హాఫ్ సెంచరీతో రాణించాడు. విన్నింగ్ షాట్ కోసం ప్రయత్నించి యశస్వి జైస్వాల్ ఔటవ్వగా.. రిషభ్ పంత్ సాయంతో విరాట్ కోహ్లీ(25 నాటౌట్) భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్తో 107 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లు తీయగా... మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వ్యూహాత్మకంగా 34.4 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా.. బంగ్లాదేశ్పై 52 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్, జడేజా, జస్ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ షెడ్మన్ ఇస్లామ్(101 బంతుల్లో 10 ఫోర్లతో 50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా..ముష్ఫీకర్ రహీమ్(63 బంతుల్లో 37) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.