హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో ఏకంగా ఐదు మార్పులు చేసింది. అయితే ఈ నిర్ణయాలను అభిమానులు తప్పుబడుతున్నారు.
ఆసియాకప్ ఫైనల్ ముంగిట ఈ ప్రయోగాలు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్తో పాటు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను కూడా బంగ్లాదేశ్తో మ్యాచ్కు దూరంగా ఉంచారు. ఆసియాకప్లో ఈ ఇద్దరూ పూర్తిగా ఆడింది రెండే రెండు మ్యాచ్లు. అంతలోనే బంగ్లాదేశ్తో నామ మాత్రపు మ్యాచ్ అని పక్కనపెట్టి విశ్రాంతి ఇవ్వడం సరికాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఈ రెండు మ్యాచ్ల్లో బుమ్రా కనీసం 10 ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేదని, అప్పుడే అతనికి రెస్ట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వన్డే ప్రపంచకప్తో పాటు ఆసియాకప్ ఫైనల్కు సిద్దమవుతున్న టీమిండియా ప్రధాన ఆటగాళ్లను పక్కనపెట్టి బెంచ్ ఆటగాళ్లను ఆడించి ఏం చేయాలనుకుంటుందని నిలదీస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ ఎంపిక కానీ తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలను ఆడించడంలో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేక టీమిండియా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని గుర్తు చేస్తున్నారు. రిథమ్లో ఉన్న ఆటగాడిని పక్కనపెడితే ఫామ్ కోల్పోతారని హెచ్చరిస్తున్నారు.
టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయోగాలు చేస్తున్న రాహుల్ ద్రవిడ్.. ఫైనల్ మ్యాచ్ ముందు కూడా తుది జట్టులో మార్పులు చేయడం బాలేదని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఫైనల్ చేరిన శ్రీలంక స్పిన్కు టీమిండియా పూర్తిగా తడబడింది. స్పిన్ ఆడలేక భారత ఆటగాళ్లు పూర్తి చేతులెత్తేసారు.
బంగ్లాదేశ్తో మ్యాచ్ ఫైనల్కు ముందు భారత జట్టుకు మంచి సన్నాహకంగా ఉండేదని, మంచి స్పిన్ ప్రాక్టీస్ లభించేదని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల ధాటికి 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.