భారత్- బంగ్లాదేశ్ రెండు టెస్ట్ల సిరీస్కు రంగం సిద్దమైంది. మరో ఐదు రోజుల్లో ఈ మెగా సిరీస్కు తెరలేవనుంది. 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మైదానంలోకి బరిలోకి దిగుతోంది. చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా.. బీసీసీఐ ఈ మ్యాచ్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఇప్పటికే భారత ఆటగాళ్లంతా చెన్నై చేరి ప్రాక్టీస్ మొదలు పెట్టారు. నెట్స్లో గంటలకొద్దీ శ్రమిస్తున్నారు. అయితే భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్కు రెడ్ సాయిల్ పిచ్ను సిద్దం చేసినట్లు చెపాక్ మైదాన వర్గాలు పేర్కొన్నాయి.

బంగ్లాదేశ్ జట్టు తమ స్వదేశంలో ఎక్కువగా బ్లాక్ సాయిల్ పిచ్పై ఆడుతోంది. నల్లటి మట్టి పిచ్లు బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉంటాయి. బౌలింగ్కు అనుకూలిస్తాయి. చెపాక్ పిచ్ సాధారణంగా స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుంది. అయితే తొలి టెస్ట్కు రెడ్ సాయిల్ పిచ్ రెడీ చేస్తుండటంతో బంగ్లాదేశ్ జట్టుకు సవాల్ ఎదురవ్వనుంది. రెడ్ సాయిల్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది.
ఇక ఇరు జట్లు ప్రాక్టీస్ చేసేందుకు బ్లాక్ సాయిల్ పిచ్ ఇవ్వడం గమనార్హం. దాంతో తొలి టెస్ట్కు ముందు రెడ్ సాయిల్ పిచ్పై బంగ్లాదేశ్కు ప్రాక్టీస్ లేకుండా పోతుంది. దాంతో ఆ జట్టుకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. రెడ్ సాయిల్ పిచ్పై జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్లకు కష్టమైన పనే.
ఇక భారత ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చారు. మరో వారం రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్ కొనసాగనుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్లో పాల్గొంటారు. ఈ ప్రాక్టీస్లో బంగ్లాదేశ్ బౌలర్ల తరహాలో బౌలింగ్ చేసే తమిళనాడు క్రికెటర్లు అజిత్ రామ్, సిద్ధార్థ్, విష్నేష్ వంటి బౌలర్లను భారత బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ అనంతరం భారత్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లు ఆడనుంది. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా మొత్తం 10 టెస్ట్ మ్యాచ్ల్లో బరిలోకి దిగనుంది. దాంతోనే బంగ్లాదేశ్తో సిరీస్కు ప్రాధాన్యత ఏర్పడింది.