టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చెన్నై అభిమానులు ఎగతాళి చేశారంటూ జరిగిన ప్రచారాన్ని అక్కడి ఫ్యాన్స్ ఖండించారు. ఆ ప్రచారానికి ధీటుగా కోహ్లీ నామస్మరణతో చెన్నై స్టేడియాన్ని దద్దరిల్లించారు. టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన కోహ్లీ అంటే తమకు విపరీతమైన అభిమానమని తమ చర్యలతో చాటి చెప్పారు.
అభిమానుల పిలుపునకు కోహ్లీ కూడా చేతులు ఊపుతూ స్పందించాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో విరాట్ కోహ్లీ ఔటైన సందర్భంలో చెన్నై అభిమానులు బిగ్గరగా అరుస్తూ సంతోషం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ కొంతమంది నెటిజన్లు చెన్నై అభిమానులను తప్పుబట్టారు.
ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ సంచలన విజయంతో రన్రేట్ను మెరుగుపరుచుకొని ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
అతి సంబరాలతో..
ఈ విజయాన్ని ఆర్సీబీ అభిమానులు టైటిల్ గెలిచినంత రీతిలో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సంబరాలు చెన్నై అభిమానులను తీవ్రంగా బాధించాయి. అయితే ఫస్టాఫ్ సీజన్లో వరుస పరాజయాలతో చతికిలపడిన ఆర్సీబీ.. సెకండాఫ్లో సంచలన ప్రదర్శనతో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ చేరడంతో ఆ జట్టు అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది.
ఈ క్రమంలోనే ఆర్సీబీ, విరాట్ కోహ్లీపై కొంతమంది సీఎస్కే అభిమానులు కోపం పెంచుకున్నారు. ప్లే ఆఫ్స్లో ఆర్సీబీ ఓడినప్పుడు సంబరాలు చేసుకున్నారు. ఇదే కోపాన్ని బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ సందర్భంగా కూడా చూపించారని కొంతమంది నెటిజన్లు ఆరోపించారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. విరాట్ కోహ్లీ ఔటైనందుకు అభిమానులు బిగ్గరగా అరవలేదు.
పంత్ కోసం అరిస్తే..
రిషభ్ పంత్ మైదానంలోకి వస్తుండటంతో బిగ్గరగా అరిచారు. రోడ్డు ప్రమాదంతో రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంత్ రెడ్ బాల్ క్రికెట్ ఆడుతుండటంతో అతనికి స్వాగతం పలుకుతూ గట్టిగా అరిచారు. అంతే తప్పా కోహ్లీ ఔటయ్యాడని కాదు. కానీ కొంతమంది నెటిజన్లు ఉద్దేశపూర్వకంగా కోహ్లీని చెన్నై ఫ్యాన్స్ ఎగతాళి చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. దాంతో రెండో రోజు ఆటలో కోహ్లీ నామస్మరణతో అతనిపై తమకు ఉన్న అభిమానాన్ని చెన్నై అభిమానులు చాటుకున్నారు.