బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్లో పర్యాటక బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టెస్ట్లో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్ట్లోనూ బంగ్లాదేశ్ను ఓడించాలనుకుంటుంది.
తద్వారా సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనుకుంటోంది. ఇప్పటికే కాన్పూర్ చేరిన టీమిండియా నెట్స్లో గంటల కొద్దీ శ్రమిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం బ్లాక్ సాయిల్ పిచ్ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్కు రెడ్ సాయిల్ పిచ్ను సిద్దం చేయగా.. ఈ వికెట్ పేస్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్, స్పిన్కు సహకరించింది.

రెండో టెస్ట్కు కూడా ఇదే తరహా సమతూకమైన రెడ్ సాయిల్ పిచ్ సిద్దం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ వివరాల ప్రకారం బ్లాక్ సాయిల్ పిచ్ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ సాయిల్ పిచ్పై స్పిన్నర్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. సహజంగా కాన్పూర్ వికెట్ స్పిన్నర్లకు సహకరిస్తోంది. ఇప్పుడు బ్లాక్ సాయిల్ పిచ్ రెడీ చేస్తుండటంతో ఇరు జట్లు ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది.
చెన్నై టెస్ట్లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. కాన్పూర్లో మాత్రం ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగితే కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు. ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్ల్లో ఒకరు బెంచ్కు పరిమితమవుతారు. 2021లో ఇక్కడ జరిగిన టెస్ట్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.
జడేజా, అశ్విన్తో పాటు అక్షర్ పటేల్ ఆడాడు. ఆ మ్యాచ్లో అక్షర్ పటేల్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఈ ఫామ్ను పరిగణలోకి తీసుకుంటే అక్షర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకొవచ్చు. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా రెండో టెస్ట్లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియాకు సూచించాడు. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని చెప్పాడు.
బ్లాక్ సాయిల్ పిచ్ బంగ్లాదేశ్కు కలిసి రానుంది. ఆ జట్టు సొంతగడ్డపై ఎక్కువగా బ్లాక్ సాయిల్ పిచ్లపైనే ఆడుతోంది. పైగా ఆ జట్టులో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే రెండో టెస్ట్ రసవత్తరంగా సాగే అవకాశం ఉందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.