పుణె: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని లిటన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. హార్దిక్ పాండ్యా బంతిని ఆపే క్రమంలో జారిపడ్డాడు.
దాంతో అతని ఎడమ కాలి మడమకు తీవ్ర గాయమైంది. నొప్పితో విలవిలలాడిన హార్దిక్కు టీమిండియా ఫిజియోలు ప్రథమ చికిత్స అందించారు. అయినా అతను ఇబ్బంది పడుతుండటంతో బయటకు తీసుకెళ్లారు. దాంతో చివరి మూడు బంతులను విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు. మూడు బంతులు బౌలింగ్ చేసిన కోహ్లీ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

గంటకు 103 కిలో మీటర్ల వేగంతో కోహ్లీ బౌలింగ్ చేయగా.. బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. హార్దిక్ పాండ్యా గాయం తీవ్రతపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అతని గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పరిశీలిస్తోందని, స్కానింగ్ కోసం ఆసుపత్రికి కూడా తరలించామని బీసీసీఐ ప్రకటించింది.
స్కానింగ్లో ఫ్రాక్చర్ ఉన్నా..గాయం తీవ్రత ఎక్కువగా ఉండి జట్టుకు దూరమైనా.. టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బే.
తదుపరి మ్యాచ్ల్లో టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లతో తలపడాల్సి ఉంది. హార్దిక్ దూరమైతే.. టీమిండియా కాంబినేషన్లో కూడా సమతుల్యం మిస్సవ్వనుంది. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లో సత్తా చాటే హార్దిక్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు భారత జట్టులో మరొకరు లేకపోవడం గమనార్హం.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. ప్రస్తుతం వేగంగా పరుగులు చేస్తోంది. ఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా ఆటగాళ్ల అలసత్వం బంగ్లాదేశ్కు కలిసొచ్చింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో బంగ్లా ఓపెనర్ తన్జిద్ హసన్ వికెట్ల ముందు దొరికిపోయాడు.
కానీ భారత ఆటగాళ్లు బంతి బ్యాట్ను తాకిందని భ్రమపడి కనీసం అప్పీల్ కూడా చేయలేదు. కానీ రిప్లేలో ఇది క్లియర్ ఎల్బీగా తేలింది. ఈ అవకాశంతో తన్జిద్ హసన్ చెలరేగాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్లో తన్జిద్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను కూడా చేజారింది. ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అతను 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.