బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. చెన్నై వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఎలాంటి మార్పులు లేకుండా తొలి టెస్ట్కు ఎంపిక చేసిన జట్టునే కొనసాగించింది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరిగినా.. అతన్ని కొనసాగించింది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్.. మూడో సారి ఫైనల్కు చేరుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్తో రెండో టెస్ట్కు ప్రధాన జట్టును బరిలోకి దించుతోంది. బోర్డు నిర్ణయంతో తుది జట్టులో కూడా పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.
కాన్పూర్ పిచ్ కూడా పేస్కు అనుకూలంగా ఉండనుంది. మరోసారి టీమిండియా ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే కుల్దీప్ యాదవ్కు మరోసారి నిరాశే ఎదురుకానుంది. మూడో పేసర్గా ఆకాశ్ దీప్ స్థానంలో యశ్దయాల్కు అవకాశం ఇవ్వవచ్చు. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ తొలి విజయాన్ని నమోదు చేశాడు.
బంగ్లాదేశ్తో రెండో టెస్ట్కు భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్