కొలంబో: ఆసియాకప్ 2023లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా గురువారం బంగ్లాదేశ్తో జరిగిన చివరి సూపర్ 4 మ్యాచ్లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్(85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 80), టౌహిడ్ హృదయ్(81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో నసుమ్ అహ్మద్(44), మెహ్దీ హసన్(29 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా నిర్ణీత 49.5 ఓవర్లలో 249 పరుగులకు కుప్పకూలింది. శుభ్మన్ గిల్(133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 121) సెంచరీ పోరాటం వృథా అయ్యింది. అతనికి తోడుగా అక్షర్ పటేల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 42)ఒక్కడే రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/50) మూడు వికెట్లు తీయగా.. తంజిమ్ హసన్ షకీబ్(2/27), మెహ్దీ హసన్(2/50) రెండేసి వికెట్లు పడగొట్టారు. షకీబ్ అల్ హసన్, మెహ్దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.
బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా 139 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(0)తో పాటు తెలుగు తేజం తిలక్ వర్మ(5), కేఎల్ రాహుల్(19), ఇషాన్ కిషన్(5), సూర్యకుమార్ యాదవ్(26) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(7) కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు సూపర్ బ్యాటింగ్తో సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్మన్ గిల్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
అదే జోరులో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ సాయంతో అక్షర్ పటేల్ సూపర్ బ్యాటింగ్తో విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ ఔటవ్వడంతో టీమిండియా ఓటమి ఖాయామైంది. చివరి ఓవర్లో భారత్ విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. షమీ బౌండరీ బాది.. క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రనౌటయ్యాడు. దాంతో బంగ్లాదేశ్ విజయం లాంఛనమైంది.