బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(3/31)తో పాటు అర్ష్దీప్ సింగ్(3/14) మూడేసి వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. ఈ ఇద్దరూ బంతితో నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది.
మెహ్దీ హసన్ మీరాజ్(32 బంతుల్లో 3 ఫోర్లతో 35 నాటౌట్), నజ్ముల్ హెస్సేన్ షాంటో(25 బంతుల్లో ఫోర్, సిక్స్తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రర్తీ, అర్ష్దీప్ సింగ్తో పాటు మయాంక్ యాదవ్(1/21), హార్దిక్ పాండ్యా(1/26), వాషింగ్టన్ సుందర్(1/12)తలో వికెట్ తీసారు.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు తొలి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఓపెనర్ లిట్టన్ దాస్(4) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ పర్వేజ్ హెస్సేన్ ఇమోన్(8)ను పెవిలియన్ చేర్చాడు. పవర్ ప్లేలో చివరి ఓవర్ వేసిన మయాంక్ యాదవ్.. నిప్పులు చెరిగాడు.
వేగవంతమైన బౌలింగ్తో మెయిడిన్ ఓవర్ వేసి తన కెరీర్ను ఘనంగా ప్రారంభించాడు. మయాంక్ ధాటికి ఇబ్బంది పడిన టౌహిడ్ హృదయ్.. వరుణ్ చక్రవర్తీ వేసిన మరుసటి ఓవర్లో క్యాచ్ ఔటయ్యాడు. మయాంక్ యాదవ్ వేసిన మరుసటి ఓవర్లో మహ్మదుల్లా(1)పెవిలియన్ చేరాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన జకెర్ అలీ(8)ని వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేశాడు.
నిలకడగా ఆడుతున్న నజ్ముల్ హోస్సేన్ షాంటో(27)ను వాషింగ్టన్ సుందర్ రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో మెహ్దీ హసన్ ఆచితూచి ఆడాడు. మరోవైపు రిషద్ హోస్సేన్(11)ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయగా.. టస్కిన్ అహ్మద్(12) రనౌటయ్యాడు. షోరిఫుల్ ఇస్లామ్(0)ను హార్దిక్ పాండ్యా డకౌట్ చేయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్(1) అర్ష్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు.