బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా యువ పేసర్ ఆకాశ్ దీప్.. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. టీమిండియా అటాకింగ్ గేమ్ వ్యూహానికి తగ్గట్లు టెయిలెండర్గా తన వంతు పాత్ర పోషించాడు. 2 బంతుల్లో రెండు భారీ సిక్స్లు బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ సిక్స్లను ఆకాశ్ దీప్ విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్తో బాదడం చర్చనీయాంశమైంది.
ఆకాశ్ దీప్ సిక్స్లను చూసి విరాట్ కోహ్లీ కూడా అవాక్కయ్యాడు. రింకూ సింగ్ తరహాలోనే ఆకాశ్ దీప్ భారీ సిక్స్లు బాదాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట తుడిచి పెట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయినా అటాకింగ్ గేమ్తో విజయంపై కన్నేసిన టీమిండియా.. తమ ఇన్నింగ్స్ను దూకుడుగా ఆడింది.

ఈ క్రమంలోనే ప్రతీ భారత బ్యాటర్.. వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేశారు. ఆకాశ్ దీప్ కూడా తాను ఎదుర్కొన్న రెండో, మూడో బంతులను సిక్సర్లుగా తరలించాడు. గతంలో రింకూ సింగ్ కూడా ఇలానే కోహ్లీ దగ్గర బ్యాట్ తీసుకొని చెలరేగిపోయాడు. ఒక బ్యాట్ విరిగినా.. మరో బ్యాట్ అడుక్కున్నాడు. ఇప్పుడు ఆకాశ్ దీప్ కూడా కోహ్లీ బ్యాట్తోనే సిక్స్లు బాదడంతో కింగ్ బ్యాట్లో ఏదో మ్యాచ్ ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
భారత్.. తమ తొలి ఇన్నింగ్స్ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వ్యూహాత్మకంగా 34.4 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా.. బంగ్లాదేశ్పై 52 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. అంతకు ముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్తో 107 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటాడు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (3/50) మూడు వికెట్లు తీయగా... మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.
26/2 ఓవర్నైట్ స్కోర్తో చివరి రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకు కుప్పకూలింది. తొలి సెషన్లోనే బంగ్లా ఇన్నింగ్స్ను ముగించాలనే లక్ష్యాన్ని భారత బౌలర్లు అందుకున్నారు. కెప్టెన్, కోచ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అశ్విన్, జడేజా, జస్ప్రీత్ బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు.
బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ షెడ్మన్ ఇస్లామ్(101 బంతుల్లో 10 ఫోర్లతో 50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా..ముష్ఫీకర్ రహీమ్(63 బంతుల్లో 37) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తొలి ఇన్నింగ్స్లో 52 పరుగుల ఆధిక్యం లభించడంతో భారత్ ముందు 95 పరుగుల లక్ష్యమే నమోదైంది.