ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో టీమిండియా 169 పరుగుల సాధారణ లక్ష్యాన్ని మాత్రమే నమోదు చేసింది. అభిషేక్ శర్మ(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 75), హార్దిక్ పాండ్యా(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 38), శుభ్మన్ గిల్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) మినహా భారత బ్యాటర్లు అంతా విఫలమయ్యారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులే చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్(2/27) రెండు వికెట్లు తీయగా.. తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహమ్మద్ సైఫిద్దిన్ తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు మరోసారి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. తమకే సాధ్యమైన షాట్లతో బంతులను బౌండరీకి తరలించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే బంగ్లా కెప్టెన్ జకీర్ అలీ.. స్పిన్నర్ రిషద్ హోస్సేన్ను బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు.

దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనింగ్ జోడీని రిషద్ ఊరించే బంతితో విడదీసాడు. అతని బౌలింగ్లో భారీ సిక్సర్కు ప్రయత్నించిన శుభ్మన్ గిల్ బౌండరీ లైన్పై క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగుతాడని శివమ్ దూబే(2)ను అప్ది ఆర్డర్ పంపించగా.. అతను తీవ్రంగా నిరాశపర్చాడు. రిషద్ హుస్సేన్ మరుసటి ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
Abhishek Sharma’s whirlwind knock halted by brilliance in the field 🫣
— Sony Sports Network (@SonySportsNetwk) September 24, 2025
Watch #INDvBAN LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/2NsKpa8FLg
మరోవైపు 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. సూర్యకుమార్ యాదవ్తో కలిసి తన దూకుడును కొనసాగించాడు. భారీ సిక్సర్లతో భారత స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. కానీ ముస్తాఫిజుర్ బౌలింగ్లో రిషద్ హుస్సేన్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా అభిషేక్ శర్మ(75) రనౌట్గా వెనుదిరిగాడు. బంతిని ఫీల్డర్ అందుకోవడం గమనించి సూర్య.. సింగిల్కు నిరాకరించగా నాన్స్ట్రైకర్గా ఉన్న అభిషేక్ శర్మ అప్పటికే సగం పిచ్ దాటేసాడు. యూటర్న్ తీసుకొని క్రీజును చేరుకునేలోపే ఫీల్డర్ బంతిని అందివ్వడంతో రనౌట్గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఈ రనౌట్ మ్యాచ్ గమనాన్ని మలుపు తిప్పింది. భారీ స్కోర్ దిశగా సాగిన భారత్ ఇన్నింగ్స్కు ఒక్కసారిగా బ్రేక్ పడింది.
అదే ఓవర్ ఆఖరి బంతికి సూర్య(5) ఔటవ్వగా.. తిలక్ వర్మ(5) భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో భారత పరుగుల వేగం తగ్గింది. ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడారు. తంజిమ్ హసన్ షకీబ్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా రెండు బౌండరీలు బాది 14 పరుగులు పిండుకున్నాడు. కానీ 19వ ఓవర్లో ముస్తాఫిజుర్ 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సైఫుద్దీన్ వేసిన ఆఖరి ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే రావడంతో భారత్ 168 పరుగులకే పరిమితమైంది. అక్షర్ పటేల్ జిడ్డు బ్యాటింగ్ టీమిండియాకు నష్టం చేసింది. స్లాగ్ ఓవర్లలో 15 బంతులాడిన అక్షర్ పటేల్ ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 10 పరుగులే చేశాడు.