ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మూడో టీ20కి భారీ అడ్డంకి ఏర్పడింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం జరగనున్న ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ చూస్తూ దసరా పండుగను జరుపుకోవాలనుకున్న నగర అభిమానులకు వర్షం ఆందోళన కలిగిస్తోంది.
మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దాంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేసారు. శనివారం కూడా వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అనేది ఇప్పుడు సందేహంగా మారింది. వర్షం కారణంగా ఇరు జట్లు శుక్రవారం ప్రాక్టీస్ చేయలేకపోయాయి.

ఇక శనివారం ఉదయం 40 శాతం వర్షం పడే అవకాశం ఉందని, సాయంత్రం కాస్త లైట్గా వర్షం పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఈ మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడో టీ20లోనూ విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.
మరోవైపు ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి గౌరవం కాపాడుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలవడంతో బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి టీ20లో భారత తుది జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిరాశపరిచినప్పటికీ బ్యాకప్ ఓపెనర్లు లేకపోవడంతో సంజు శాంసన్, అభిషేక్ శర్మను చివరి టీ20లోనూ కొనసాగించనున్నారు.
రెండో టీ20లో సంచలన ప్రదర్శన చేసిన యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిను కూడా జట్టులో కంటిన్యూ చేయనున్నారు. అయితే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఢిల్లీ మ్యాచ్లో హార్దిక్ కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. అతనితో సూర్య బౌలింగ్ చేయించలేదు. కాగా, హార్దిక్ పాండ్య స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు అవకాశం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఆఖరి టీ20 మ్యాచ్లో ఇద్దరు తెలుగు ప్లేయర్లు భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు.
అలాగే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్ తిరిగి జట్టులోకి రానున్నాడు. మూడేళ్ల తర్వాత వరుణ్ భారత జట్టుకు ఎంపికవ్వడంతో తొలి రెండు మ్యాచ్ల్లో రవి బెంచ్కే పరిమితమయ్యాడు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నాడు.
బంగ్లాదేశ్తో ఆఖరి టీ20 ఆడే భారత జట్టు (అంచనా)
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్/హర్షిత్ రాణా.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్.